ఇచ్చోడ, జనవరి 18 : మండలంలో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్వే ప్రారంభించారు. ఈ నెల 6వ తేదీ నుంచి కొనసాగుతున్న ఇంటింటి సర్వే 30న ముగియనుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అనేక కారణాలతో విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉంటున్నారు. ఇటుక బట్టీలు, కర్మాగారాలు, దుకాణాలు, హోటళ్లు, గొర్రెల కాపారులుగా పని చేస్తున్నారు. దీనిని గుర్తించిన ఉన్నతాధికారులు పక్కా ప్రణాళికతో వారిని తిరిగి పాఠశాలలో చేర్చేందుకు చర్యలు చేపట్టారు. ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో ముగ్గురు సీఆర్పీలు, ఒకరు ఐఈఆర్పీ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు ఇందులో పాల్గొంటున్నారు.
అవగాహన కల్పించి..
సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో వారం రోజుల్లో 15 మంది పిల్లలు బడి బయట ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఇద్దరిని పాఠశాలల్లో చేర్పించారు. ఆరు నుంచి 14 ఏళ్ల వయస్సు కలిగిన వారు 10 మంది, 15 నుంచి 19 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఐదుగురు పిల్లలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. చిన్న వయస్సు కలిగిన బాలికలు ఉన్నట్లయితే కస్తూర్బా, గురుకుల విద్యాలయాల్లో చేర్పించడం లేదా వారికి ఇష్టం లేని పక్షంలో సమీపంలోని పాఠశాలలకు పంపే విధంగా చూస్తున్నారు.
మార్గదర్శకాలు ఇలా..
గతంలో 14 ఏళ్ల లోపు వారిని నమోదు చేయగా, గతేడాది ప్రత్యేకంగా 15 నుంచి 19ఏళ్ల లోపు ఉండి ఉన్నత విద్య ఆపేసిన వారిని సైతం ఇందులో చేర్చారు. వీరితో పాటు దివ్యాంగులు (ప్రత్యేకావసరాలు కలిగిన వారు) 0 నుంచి 18 ఏళ్లలోపు, దివ్యాంగుల వివరాలు మూడు విధాలుగా నిక్షిప్తం చేశారు. ఈ నెల 29 వరకు సర్వే పూర్తి చేసి 30వ తేదీ లోపు ప్రబంద్ పోర్టర్లో నమోదు చేసి, ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లా విద్యాశాఖకు నివేదిక అందజేయాల్సి ఉంటుంది.
బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి
విద్యా హక్కు చట్టం ప్రకారం బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి. తల్లిదండ్రులు వారిని క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలి. పిల్లలు బడికి.. పెద్దలు పనికి అనే నినాదం పాటిస్తూ బడీడు కలిగిన ప్రతి పిల్ల వాడిని పాఠశాలకు పంపించాలి. పిల్లలను పనిలో పెట్టుకుంటే బాలకార్మిక చట్టం ప్రకారం చర్యలు ఉంటాయనే విషయం గ్రామాల్లో అవగాహన కల్పించాలి.
-కుమ్ము కృష్ణ కుమార్, పీఆర్టీయూ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు
బాల కార్మికులను నిర్మూలించాలి
బడీడు పిల్లలను బడికి పంపిస్తూ బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తోడ్పాటునందిస్తే అక్షరాస్యత శాతం పెరుగుతుంది. బడీడు పిల్లల చేత పనులు చేయించడం చట్టప్రకారం నేరం. స్థానిక ప్రజాప్రతినిధులు తోడ్పాటునందిస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయి.
-ఆడవ్ మారుతి, సర్పంచ్, ముక్రా(బీ)
పకడ్బందీగా సర్వే
విద్యకు దూరంగా ఉన్న పిల్లలను గుర్తించేందుకు పకడ్బందీగా సర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 18 మండలాల్లో 247 మందిని గుర్తించాం. పిల్లలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని సమీప పాఠశాలల్లో చేర్పించాం. బడీడు పిల్లలతో ఎవరైనా పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. -కంటే నర్సయ్య, జిల్లా సెక్టోరల్ అధికారి