బోథ్, డిసెంబర్ 29 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా సెక్టోరల్ అధికారి కంటే నర్సయ్య సూచించారు. మండలంలోని కన్గుట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులను చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతులను పరిశీలించి వారు ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే పరీక్షల్లో 10 జీపీఏ అందరూ సాధించాలని సూచించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు పోశెట్టి, ఉపాధ్యాయులు ఉన్నారు.
గుడిహత్నూర్, డిసెంబర్ 29 : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జనవరి 3వ తేదీన నిర్వహించే టీఎల్ఎం మేళాను విజయవంతం చేయాలని జిల్లా సెక్టోరల్ అధికారి నర్సయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో మండల స్థాయి ప్రదానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సబ్జెక్టుపై మూడు విషయాలపై టీఎల్ఎం(ఉపాధ్యాయ బోధన సామగ్రి) తీసుకురావాలని సూచించారు. ఈ మేళాను జిల్లా, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు టీఎల్ఎం తయారు చేసుకొని మేళాకు హాజరుకావాలని ఎంఈవో ఆర్ నారాయణ కోరారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.