నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ రెండో రోజూ మంగళవారం కొనసాగింది. ప్రదర్శనలను తిలకించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలి రావడంతో కోలాహలంగా మారింది. ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసేందుకు బాసర ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్కు చెందిన 45 మంది న్యాయ నిర్ణేతల బృందం సభ్యులతోపాటు డీఈవో రవీందర్రెడ్డి తిలకించారు. సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబర్చిన జూనియర్, సీనియర్స్ నుంచి రాష్ట్రస్థాయికి 14 ప్రదర్శనలు, ఇన్స్పైర్ నుంచి 40 ప్రదర్శనలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మ్యాజిక్ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక నృత్యాలు, కోలాటాలు ఆహుతులను అలరించాయి. సేఫ్టీ గ్రాస్ కటింగ్ పరికరంరైతులు పశువుల మేతకోసం పొలాల వెంట తిరుగుతూ గడ్డికోస్తుంటారు. ఆ సమయంలో పాములు, తేళ్లు కాటు వేస్తుంటాయి. ఈ సేఫ్టీ గ్రాస్ కటింగ్ పరికరం ఉపయోగించడంవల్ల ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ఈ పరికరానికున్న బటన్ ప్రెస్ చేసి గడ్డిని కోసేటప్పుడు శబ్ధం వస్తుంది. అప్పుడు విష పురుగులు పారిపోతాయి.
– ఆర్.విష్ణు వర్ధన్, జడ్పీహెచ్ఎస్ కిష్టాపూర్, జన్నారం. మంచిర్యాల జిల్లా.
నాచురల్ మస్కిటో కాయిల్స్
అనేక మంది దోమల బాధ నుంచి తమను తాము రక్షించుకునేందుకు మార్కెట్లో దొరికే మస్కిటో కాయిల్స్ను వాడుతున్నారు. వీటిని నిత్యం ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగా లభించే ఆవు పేడ, వేప ఆకులు, పసుపు, గుగ్గిలం తదితర వాటితో తయారు చేసిన నాచురల్ మస్కిటో కాయిల్స్తో ఎలాంటి ఇబ్బంది ఉండదని, దోమలు దరిచేరవని విద్యార్థిని మల్లీశ్వరి చెబుతున్నది.
– మల్లీశ్వరి, కేజీబీవీ, నిర్మల్ అర్బన్
కొవిడ్ బాధితుల కోసం వెంటిలేటర్
కొవిడ్ బాధితులకు ఉపయోగపడేలా ఈ వెంటిలేటర్ను రూపొందించారు. రోగి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడినప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేవలం రూ.2వేలతోనే దీనిని తయారు చేశారు. పల్స్ యాక్సీ మీటర్ను అమర్చడం వల్ల రోగి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.
– బీ.యమున-నందిని, జడ్పీ హెచ్ఎస్, ఆమడబాకుల, వనపర్తి.
పంటల రక్షణకు..
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడు కునేందుకు రైతులు నానా అవస్థలు పడుతుంటా రు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అటవీ జంతువుల నుంచి పంటలు కాపాడుకోవడం కష్టతరం. ఈ నేపథ్యంలో రూ.1000తో తయారు చేసిన ఈ పరికరం వివిధ రకాల శబ్ధాలు చేస్తుంది. దీంతో పక్షులు, జంతువులు పారిపోతాయి. ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా సోలార్ ద్వారా ఇది పనిచేస్తుంది.
– ఏ. ఉదయ్ కిరణ్, ఆర్ఎంఎల్, ములుగు జిల్లా.
సోలార్ బైస్కిల్
సోలార్తో రూపొందించిన ఈ బైస్కిల్పై ఇంధన ఖర్చు లేకుండా వందల కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనికి ఏర్పాటు చేసిన సోలార్ పలకలు.. నడిపే వ్యక్తికి ఎండ, వాన నుంచి రక్షణనిస్తాయి. రాత్రి వేళల్లో కూడా ప్రయాణించేలా బ్యాటరీతోపాటు లైట్ ఏర్పాటు చేశారు.
– కే.రేవంత్, శ్రీ సరస్వతి హైస్కూల్, ఎర్రవల్లి, జోగులాంబ గద్వాల
సౌర శక్తితో సాగు..
రైతులు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌరశక్తితో రూపొందించిన ఈ యంత్రం ద్వారా దుక్కి దున్నుకోవచ్చు. రూ.5వేలతో సోలార్ పలకలు ఏర్పాటు చేసుకొని రిమోట్ కంట్రోలర్ ద్వారా వాడుకోవచ్చు. ఖర్చులు మిగులుతాయి.
– వెనూష్, జడ్పీహెచ్ఎస్ జలాల్పూర్, యాదాద్రి భువనగిరి\
పక్షవాతంతో బాధపడే వారి కోసం..
పక్షవాతంతో బాధపడే వారికి ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. రోగికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఈ పరికరాన్ని కదిలిస్తే చాలు సెన్సార్, మోడమ్ ద్వారా అనుసంధానం చేసిన మొబైల్కు ఎస్ఎంఎస్ వెళ్తుంది. సహాయకులు అప్రమత్తమై వెంటనే సేవలందించవచ్చు.
– జీ. ప్రవళిక, ఎం.నందిని, గుండారెడ్డిపల్లి హైస్కూల్, (సిద్దిపేట)
హైడ్రాలిక్ పరికరం ద్వారా రోగులకు సేవలు
హైడ్రాలిక్ సిస్టం ద్వారా రోగులకు సులభంగా సేవలు చేయవచ్చు. చికిత్స పొందుతున్న రోగులకు ప్రతిరోజూ బట్టలతోపాటు వారు పడుకున్న బెడ్ షీట్లను మార్చాలంటే ఇద్దరు ముగ్గురు సహాయకులు కావాలి. కానీ.. ఈ పరికరంతో ఒక్కరి ద్వారానే రోగికి సపర్యలు చేయవచ్చు. అంతగాకుండా హెల్పింగ్ హ్యాండ్ (తాడుతో తయారు చేసిన పరికరం)ద్వారా చికిత్స పొందుతున్న వారు ఎవరి సహాయం లేకుండా లేవవచ్చు. పడుకోవచ్చు.
– పీ.సహస్ర, జడ్పీహెచ్ఎస్ఎస్, ఇలంతకుంట, (రాజన్న సిరిసిల్ల)
బధిరుల కోసం స్మార్ట్ హెల్మెట్..
చెవిటి వారికి ఈ స్మార్ట్ హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బధిరులు వాహనం నడిపేటప్పుడు వెనుక ఏదైనా వాహనం వస్తే వెంటనే సెన్సార్ ద్వారా హెల్మెట్కు అమర్చిన గ్రీన్ లైట్ వెలుగుతుంది. అదే వాహనం అతిసమీపానికి వస్తే రెడ్లైట్ వస్తుంది. వెంటనే అప్రమత్తం కావచ్చు.
– ఏ.శశివర్ధన్, జడ్పీ హెచ్ఎస్ఎస్, రాజేశ్వరపురం, ఖమ్మం.