ఆ అన్నదమ్ములిద్దరూ మార్కెట్లో డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టారు. తమకున్న ఎకరంలో 2 వేల మొక్కలు నాటగా, మరో మూడు నెలల్లో పంట చేతికందనున్నది. 2 టన్నుల దిగుబడి రానుండగా, రూ. 3 లక్షల దాకా ఆదాయం వస్తుందని ఆ యువరైతులిద్దరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
– జన్నారం, జనవరి 5
దేవునిగూడ గ్రామానికి చెందిన కల్లెం రవీందర్రెడ్డి-జమున దంపతులకు ఇద్దరు కుమారులు శివకృష్ణారెడ్డి, సాయికృష్ణారెడ్డి. వీరి చిన్నతనంలోనే తండ్రి చనిపోగా.. తల్లే కష్టపడి పెంచింది. ఇద్దరినీ డిగ్రీ వరకు చదివించింది. సాయికృష్ణారెడ్డి హాంకాంగ్ దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. వీలున్నప్పుడుల్లా ఇక్కడికి వచ్చి తమ్ముడు శివకృష్ణారెడ్డితో కలిసి వ్యవసాయం చేస్తుంటాడు. ఇద్దరు కలిసి తమకున్న 8 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు.
మార్కెట్లో డ్రాగన్ఫ్రూట్కు డిమాండ్ ఉండ గా, మరో ఎకరంలో ఆ పంట వేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామానికి వెళ్లి నర్సరీలో 2 వేల మొక్కలను కొనుగోలు చేశారు. ఒక్కో మొక్కకు రూ. 80 చొప్పున చెల్లించారు. 2022-డిసెంబర్లో మొక్కలు నాటారు. అంతకుముందే కరీంనగర్కు వెళ్లి 512 సిమెంట్ పోల్స్ను తీసుకొచ్చారు. ఒక్కో పోల్కు రూ.500 ఖర్చు చేశారు. పాతిన ప్రతి పోల్కు నాలుగు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను ఏర్పాటు చేశారు. మరో రూ. 50 వేలతో డ్రిప్ ఏర్పాటు చేసి.. వాటికి నీరందిస్తున్నారు. ఇటీవల మొక్కలు ఏపుగా పెరిగి కాయలు కూడా పడ్డాయి.
అయితే మొదటి (6 నుంచి 8 నెలలు మధ్య) పంట నాణ్యతగా ఉండదు కాబట్టి.. కాయలన్నీ కోసివేశారు. మరో 3 నెలల్లో పంట చేతికి వచ్చే అవకాశమున్నది. ఎకరంలో 2 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు రూ. 150 వరకు ధర పలుకుతుంది. ఈ లెక్కన రూ. 3 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలకోసారి దిగుబడి వస్తుందని, మొక్కలు నాటినప్పటి నుంచి 20 ఏండ్ల దాకా ఆదాయం పొందవచ్చని అన్నదమ్ములు పే ర్కొంటున్నారు. పంట పెట్టుబడి కోసం రూ. 6 లక్షల దాకా ఖర్చు చేశామని, ఆశించిన విధంగా పంట పండితే రెండేళ్లలో పెట్టుబడి డబ్బులు తిరిగొస్తాయని వారు చెబుతున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేటప్పుడు మొదట్లో పెట్టుబడి రూ. లక్షల్లో ఉంటుంది. అందుకే ప్రభుత్వం సబ్సిడీ అందించి రైతులను ప్రోత్సహించాలి. మాకు 9 ఎకరాల భూమి ఉంది. 8 ఎకరాల్లో వరి వేస్తున్నం. మరో ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నం. ఈ పంట లాభదాయకమైనది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆరు నెలలకోసారి దిగుబడి వస్తుంది. ఒక్కసారి పంట వేస్తే 20 ఏండ్ల దాకా ఆదాయం పొందే వీలుంటుంది.
– కల్లెం శివకృష్ణారెడ్డి, దేవునిగూడ
పామాయిల్ సాగుకు ఎలాగైతే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు కూడా సబ్సిడీ ఇవ్వాలి. అప్పుడు అనేక మంది రైతులు వినూత్న పంటల సాగుకు ముందుకు వస్తారు. ఎప్పుడూ ఒకేరకమైన పంటలు పండించి నష్టపోయేకన్నా.. పండ్ల సాగుపై ఆసక్తి చూపితే బాగుంటుందనేది నా అభిప్రాయం. అందుకే ప్రయోగాత్మకంగా మేము ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ వేశాం. పంట మంచిగనే ఉంది. మరో మూడు నెలల్లో దిగుబడి వస్తుంది. మేము రూ. 6 లక్షల దాకా పెట్టుబడి పెట్టాం. రెండు పంటల్లో పెట్టుబడికి పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయనుకుంటున్నం. మిగతా 20 ఏండ్ల దాకా ఆదాయం మిగులుతుంది.
– కల్లెం సాయికృష్ణారెడ్డి, దేవునిగూడెం