నిర్మల్ చైన్గేట్, ఫిబ్రవరి11: ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది చాలా కీలకం. సంక్షేమ పథకాలు పొందాలన్నా, ఏదైనా దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కార్డు నంబర్ తప్పనిసరైంది. కుటుంబ స భ్యులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు అన్ని రకాల కార్డులలో తమ పిల్లలను చేర్చేందుకు శిశువుల ఆధార్ తప్పనిసరిగా మారింది. చిన్నారులకు ఆధార్ కార్డు నంబర్ అవసరం ఉండడంతో శిశువులను తీసుకొని ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లడం అక్కడ పడిగాపులు కాస్తూ నిరీక్షించడం వల్ల తల్లులు అనేక పాట్లు పడుతుండేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఆధార్ నమోదు ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని దవాఖానల్లో పుట్టిన శిశువుకు వెంటనే ఆధార్ జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకు గాను మాతా శిశు ఆరోగ్య కేంద్రాల్లో శిశువుల ఆధార్ నమోదుకు తగు ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. నిర్మల్ జిల్లాలోని మాతా శిశు ఆరోగ్యకేంద్రంలో, భైంసా దవాఖానలో ఇటీవల శిశువుల ఆధార్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. నిర్మల్ ఎంసీహెచ్లో 120, భైంసాలో 32 శిశువులకు ఆధార్ నమోదు చేశారు.
ఆధార్ నమోదు ఇలా..
దవాఖానలోనే ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం ఇందుకుగాను ప్రత్యేక ఎన్రోల్మెంట్ విధానాన్ని రూపొందించింది. దవాఖానలోని సిబ్బంది పుట్టిన శిశువు వద్దకు వచ్చి శిశువు చిత్రాన్ని ట్యాబ్లో నమోదు చేసి తల్లిదండ్రుల వివరాలు నమోదు చేస్తారు. వారి బయోమెట్రిక్ నమోదు చేయగానే ఆధార్ నంబర్ వస్తుంది. ఈ నంబర్ ఆధారంగా మీసేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవచ్చు. శిశువుకు ఐదేళ్లు వచ్చేవరకు ఆ నంబర్ను వినియోగించుకోవచ్చు. అనంతరం బయో మెట్రిక్ నమోదు ద్వారా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.