నిర్మల్ చైన్గేట్, అక్టోబర్,28 : మాతా శిశు సంరక్షణతో పాటు వారి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. గర్భిణుల్లో రక్తహీనత నివారణ, మాతృ మరణాల నివారణకు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు గాను సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది.
నిర్మల్ జిల్లాలో 3134 మందికి న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయగా ప్రక్రియ కొనసాగుతున్నది. ఒక్కొక్కరికి రెండు సార్లు ఈ కిట్ అందిస్తారు. మొదటి కిట్ను 13-27 వారాల మధ్య, రెండో ఎన్సీ సమయంలో ఇస్తున్నారు. రెండో కిట్ను 28-34 వారాల మధ్య జరిగే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో ఇస్తారు. అన్ని ప్రభుత్వ దవాఖానలో ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. ఉచితంగా న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయడంపై గర్భిణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గర్భిణులకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉండకూదని ప్రభుత్వం ఉచితంగా న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేయడం హర్షణీయం. రక్తహీనత సమస్య, పౌష్టికాహార లోపం నివారణకు గాను ఈ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేయడం అభినందనీయం. ఈ కిట్లో ఉన్న మందులు, ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్నాం. రెండు సార్లు ఈ కిట్లు పంపిణీ చేస్తున్నారు. కిట్ల పంపిణీ వల్ల పేద కుటుంబాలలో ఆర్థిక భారం తగ్గుతోంది.
-సింధూజ, గర్భిణి, ధర్మారం
మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేయడం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు లభిస్తాయి. గర్భిణులలో రక్తహీనత, పౌష్టికాహారం లోపం నివారించేందుకు ప్రభుత్వం ముందుచూపుగా న్యూట్రిషన్ కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది.
-సంపెర్ల సుప్రియ, పీచర
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. సీఎం కేసీఆర్ గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టడం సంతోషకరం. ఉచితంగా రూ. 2 వేలకు పైగా విలువ చేసే మందులు, పోషకాహార పదార్థాలతో కూడిన కిట్టు ఇవ్వడం హర్షణీయం. ఆర్థిక స్తోమత లేని పేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇంతేగాక ప్రభుత్వ దవాఖానలలో కేసీఆర్కిట్ అందిస్తున్నారు.
-సౌందర్య, గర్భిణి