సమైక్య పాలనలో సిరులతల్లి సింగరేణి నిర్లక్ష్యానికి గురైంది. పాలకుల ధోరణి కారణంగా సంస్థ నష్టాల్లోకి పోయింది. అప్పులు కట్టలేక అప్పటి కాంగ్రెస్ సర్కారు పూర్తిగా తెలంగాణ ఆస్తిగా ఉన్న సంస్థలో 49 శాతం వాటాను కేంద్రానికి అమ్మింది. ఇగ కార్మికుల భద్రతను పట్టించుకోకుండా చోద్యం చూసింది. నాటి పాలకుల తీరుతో సంస్థ నష్టాల్లోకి వెళ్లగా, స్వరాష్ట్రంలో పునర్వైభవం దిశగా సాగింది.
కార్మికుల ఒక్కో హక్కును సాధిస్తూనే, సంస్థ గణనీయ లాభాల వైపు అడుగులు వేసింది. కారుణ్య నియామకాల పునరుద్ధరణ, ఇతర డిమాండ్లు నెరవేరడం కార్మికలోకంలో సంతోషం నింపింది. ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో గత తొమ్మిదేళ్లలో సాధించిన హక్కులను గుర్తు చేసుకుంటున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీబీజీకేఎస్ యూనియన్ తమను, సంస్థను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నరని స్పష్టం చేస్తున్నది.
-మంచిర్యాల, డిసెంబ ర్9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బొగ్గుబాయి పని అంటేనే గజ్జున వణకాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. భూగర్భ గనుల్లో లోసీమ్లో డ్యూటీ చేసేందుకు పోతే తిరిగి రావాలని దేవుడిని మొక్కుకొని పోయేటోళ్లు. దినదిన గండంగా భయపడుతూ భిక్కుభిక్కుమంటూ పని చేసేటోళ్లు. భూ గర్భగనుల్లో చిన్నగా ఉన్న రంధ్రాల్లోకి వంగిపోయి బొగ్గును తవ్వుకొని తట్టలతో నెత్తిమీద పెట్టుకొని బయటికి తెచ్చి పోయాలంటే దుఃఖం వచ్చేది. ప్రకృత్రికి విరుద్ధంగా భూగర్భంలో రెండున్నర కిలోమీటర్లు లోపలికి నడిచిపోయి, రెండున్నర కిలోమీటర్లు తిరిగి రావడానికే సగం శక్తి వృథా అయ్యేది. కార్మికుల భద్రత అందని ద్రాక్షగా ఉండేది.
తెలంగాణ వచ్చాక గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో ప్రభుత్వ ప్రోత్సాహంతో సింగరేణి సంస్థ ఎన్నో విజయాలు సాధించింది. ఉమ్మడి పాలనలో నష్టాల్లో ఉన్న సంస్థ ఇప్పుడు లాభాలు చూస్తున్నది. బొగ్గు ఉత్పత్తితోపాటు కార్మికుల సంక్షేమంలోనూ దూసుకుపోతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు సింగరేణి కార్మికుల దశ, దిశను మార్చాయి. కార్మికులకు సంస్థ లాభాల్లో అత్యధిక లాభాలు వచ్చాయి. పని విధానం మెరుగుపడింది.
భూగర్భ గనుల్లో ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకప్పుడు మనిషి చేసే పని ఇప్పుడు మిషనరీ చేస్తున్నది. గనుల్లోకి నడిచివెళ్లే అక్కర లేకుండా మ్యాన్రైడింగ్ వచ్చింది. కార్మికులకు భద్రత పెరిగింది. బ్లాస్టింగ్ పద్ధతులు మారాయి. సులభతరమైన పని విధానాలు వచ్చాయని కార్మికులు చెబుతున్నారు. గడిచిన పదేండ్లలో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలతో సంస్థకు నష్టాలు తప్పినయ్. కష్టాలు తప్పినయ్ అంటూ కార్మికుల కడుపులోని ‘అసలు ముచ్చట’ చెప్తున్నరు. ఎస్సార్పీ-3 మైన్పై కార్మికుల ముచ్చట వారి మాటల్లోనే..
మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు అయినయ్. కాంగ్రెసోళ్లు గెలిచిండ్రు. మళ్లీ 27వ తారీఖు మన గుర్తింపు సంఘం ఎన్నికలు ఉంటయంట. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే సింగరేణి కోసం కొట్లాడింది బీఆర్ఎస్ సర్కార్ ఒక్కటే. దేశవ్యా ప్తంగా బొగ్గుగని కార్మికులను దేశ సరిహద్దుల్లో సైనికులుగా గుర్తించి ఆదాయ పన్ను రద్దు చేయాల ని అసెంబ్లీలోనే తీర్మానం చేసి పంపింది మనోళ్లే. ఆదాయపు పన్ను రద్దుచేస్తే ఏడాదికి రూ.60వేల నుంచి రూ.4లక్షల వరకు కార్మికులకు ఆదా అయితది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 3.8 లక్షల కార్మికులకు మేలైతది. గింత మందికి మంచిజేసే ఆలోచన గతంలో ఎవ్వలు చేయలే.
కేసీఆర్ ఒక్కడే చేసిండు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆ కేంద్ర ప్రభుత్వం దేకుతలేదు. పైకెల్లి ఉన్న గనులను వేలం వేయాలని చూస్తున్నది. గట్ల మా పొట్టగొట్టే పని చేయాలని చూస్తున్న కేంద్రం కుట్రలను ఆపే శక్తి తెలంగాణ పార్టీకి తప్ప ఎవ్వరికీ లేదు. ఇక్కడున్న కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లను నమ్మితే మాత్రం గనులు వేలం పాట పడుతరు. ఢిల్లీల ఉన్నోడు చెప్పినంక.. ఇక్కడున్నోడు అడ్డుకుంటడా.. ఆపుతడా..? గందుకే చెప్తున్న సింగరేణి కోసం కొట్లాడేది బీఆర్ఎసోళ్లే.. ఎన్నటికున్నా మనోళ్లు మనోైళ్లెతరు గానీ మందోళ్లు మనోళ్లు ఎైట్లెతరు..
మీరైతే చిన్న పిల్లలు.. మొన్ననే సింగరేణికి వచ్చినోళ్లు.. నేనైతే చాలా రోజుల సంది పని చేస్తున్న. ఒకప్పుడున్న సింగరేణి కట్టం గిప్పుడు లేదు. మొత్తం మారిపోయింది. మంచిగ పనిచేసుకోండి. ఒకప్పుడు కార్మికుడు కొత్తగా అపాయింటైతే. బదిలీ కోల్ ఫిల్లర్గా ఫస్ట్ పని ఇస్తుండే. వాడు రెగ్యులరైజ్ కోల్ ఫిల్లర్ కావడానికే ఐదారేండ్లు పట్టేది. బాస్కెట్ ఫిల్లింగ్ పని ఎంతో కట్టమైతుండే.. తట్టలో బొగ్గు నింపి నెత్తిన పెట్టుకొని డబ్బాలో పోసేది.. దాన్ని ఇప్పుడు తీసేశారు. గిప్పుడు మీకైతే 190 మస్టర్లు చేస్తే పర్మినెంట్ చేస్తున్నరు.
ఒకప్పుడు అది లేదు.. కోల్ ఫిల్లర్ పని చేయలేక పారిపోయినోల్లు కూడా ఉన్నరు. ఇప్పుడు పని సులువైంది అందుకే నువ్వు అన్నట్లు ఐటీ జాబ్లు వదులుకొని వస్తుండ్రు. గిప్పుడు మన మైన్ల 70శాతం మంది ఉన్నత చదువులు చదివినోళ్లే ఉన్నరు. చివరకు అమ్మాయిలు కూడా పని చేస్తున్నరు. గంత మంచిగైంది సింగరేణి..
నేను ఇల్లు కట్టుకుందమన్న టైమ్కు నాకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చిండ్రు తమ్మి.. దానితోనే నేను తొందర ఇండ్లు కట్టుకోగలిగిన. రుణం బ్యాంక్ వాళ్లు మంజూరు చేస్తే యాజమాన్యమే దానికి సంవత్సరానికి రూ.50వేల వడ్డీ మాఫీ చేసుకుంట పోతున్నది. నా ఇల్లు నిలబడింది. ఇన్ని రోజులు కంపెనీ క్వార్టర్లో ఉన్నా.. ఇప్పుడు కంపెనీ సాయం తీసుకొని సొంతిల్లు కట్టుకున్న.. కేసీఆర్ శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంల సభ పెట్టి వడ్డీలేని పైసలు ఇస్తా అనంగనే ఇళ్లు కట్టాలనే ఆలోచన వచ్చింది.
ఇదే పది లక్షలు బయట తెస్తే నెలకు రూ.20వేల మిత్తి అయ్యేటిది. ఇప్పుడా గోసంతా తప్పింది కదా.. ఇంతకుముందు దిగిపోయిన చాలా మంది కార్మికులు అప్పట్ల గీ స్కీమ్ లేక ఇల్లు కట్టుకోలేక పోయిన్రు. వాళ్లు ఇప్పుడు ఎంత గోస పడుతున్నరో మనం సూత్తున్నం కదా.. నాకు మల్లే సొంతిల్లు కావాలనుకునేటోల్లకు ఇది సానా ఉపయోగపడ్తది. తమ్మి.. మీరందరూ యువకులు కొలువు జేస్తున్నప్పుడే ఇండ్లు కట్టుకోండి. వడ్డీ మాఫీని ఉపయోగించుకోండి.
అవునవును.. కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తి, ఉద్యమంలో కార్మికుల పోరాటాన్ని, తెగింపు చూసిన కేసీఆర్ సీఎం అయ్యాకే సింగరేణి బతుకు మారింది. ప్రతి ఏడాది కార్మికులకు లాభాల వాటా పెంచి ఇస్తున్నరు. ఈ ఏడాది 32 శాతం ఇచ్చిండు. 2000 సంవత్సరం నుంచి లాభాల వాటా 10శాతంతో ఇవ్వడంతోని మొదలుపెట్టిండ్రు. గప్పుడున్న ప్రభుత్వాలు పెద్దగ పెంచలే. 2014 వచ్చినంక ఇచ్చింది 16శాతమే. కానీ తెలంగాణ వచ్చినంక 2014 నుంచి 2023 వరకు తొమ్మిదేళ్లలో 32 శాతానికి లాభాల వాటా తీసుకుపోయిండ్రు.
సంస్థ కష్టాల్లో ఉన్నా, లాభాలు తగ్గినా, పెరిగినా లాభాల వాటా ప్రతి ఏటా పెంచి ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది. దసరా, దీపావళికి ముందే లాభాల వాటా బ్యాంకుల వడుతున్నయ్. తక్కువల తక్కువ ఒకొక్కలికి రూ.వేల నుంచి రూ.మూడు లక్షల దాకా లాభాల వాట వచ్చింది. 2014కు ముందు రూ.20వేలు, రూ.30వేలు కూడా రాకపోయేది. ఒక్కొక్కసారి రూ.10 వేలు కూడా వచ్చిన సందర్భాలున్నయ్. తెలంగాణ రాకుంటే గింతగనం వచ్చేటియి కాదు.
అవ్ నర్సింగ్ కాక.. లాభాల్లా వాటా ఇచ్చుడు ఒక్కటేనానే.. కారుణ్య నియామకం ఇచ్చి నా బతుకును నిలబెట్టిండ్రు.. మా నాయన రిటైర్మెంట్ అయినంక ఆ నౌకరి నాకు రాదని బాధపడిన. గప్పటికే కాంగ్రెసోళ్లు కారుణ్య నియామకాలను తీసేసి 24 ఏండ్లు అయితుండే. నాకు రావాల్సిన నాన్న ఉద్యోగం ఆగిపోయి ఆఖరికి నేను డ్రైవర్ పనిలో చేరిన.
తెలంగాణ వచ్చినంక 2016లో దరఖాస్తులు పెట్టుకొమ్మన్నరు. గప్పుడు అప్లయ్ చేస్తే 2020లో నాన్న వారసత్వ ఉద్యోగం నాకు వచ్చింది. ఎప్పుడో పదేళ్ల క్రితం రావాల్సిన నౌకరి నాకు 30 ఏండ్ల వయసు వచ్చినంక వచ్చే. కేసీఆర్ చలువతోనే నేను మా కుటుంబం సంతోషంగా బతుకుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక గీ నిర్ణయం తీసుకోకుంటే నాకు సింగరేణి నౌకరి వచ్చేది కాదు. సింగరేణిలో 12,500 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చి, 2015 వరకు పెండింగ్లో ఉన్న 3,500 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత తెలంగాణ సర్కార్కే దక్కుతది.
అబ్బా ఏం చెప్పినవ్ కుమారు.. ఎన్ని జేసిండ్రు మన కోసం. గీ ప్రభుత్వంలో ఎవ్వలు ఊహించనివి కూడా చేసి చూపిచ్చిండ్రు. అంబేద్కర్ జయంతి, క్రిస్మస్, రంజాన్, సంకాంత్రికి పీహెచ్డీ(పెయిడ్ హాలీ డే) ఇస్తున్నరు. తెలంగాణ వచ్చినంక 2014 వరకు కంపెనీ రోల్స్లో ఉన్న ప్రతి కార్మికుడికి తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిండ్రు.. తెలంగాణ కంటే ముందే ప్రత్యేక రాష్ర్టాలు ఎన్నో ఏర్పడినయ్. కానీ.. అక్కడున్న బొగ్గు గనుల్లో వాళ్లు ఏం చేయలే.. మనకైతే ఇంక్రిమెంట్ వేసిండ్రు. 2011లో సకల జనుల సమ్మె చేసినం… 45 రోజులు పలుగు, పార పక్కన పెట్టి కొట్లాడినం… గా సమ్మె పీరియడ్కు కూడా జీతం ఇచ్చుడు ఒక మిరాకిల్ తెలుసా.. ఒకప్పుడు కార్మికులకు, వాళ్ల పిల్లలకు మాత్రమే కార్పొరేట్ వైద్య సదుపాయం ఉండే.
ఇప్పుడు తల్లిదండ్రులను కూడా చేర్చిండ్రు. కరెంట్ బిల్లులు మాఫీ చేసి.. సంస్థ అధికారులతో సమానంగా మనకు ఏసీ బిల్ కూడా ఇస్తున్నరు. కార్మికులు సచ్చిపోతే రూ.25 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్నరు. కోలిండియాలోనే ఎక్కడా లేని సంక్షేమం సింగరేణి కార్మికులకు అందిస్తున్న గొప్ప రాష్ట్రం ఒక్క తెలంగాణనే.. గివన్నీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండబట్టిగనే అయినయ్. నేనైతే బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం(టీబీజీకేఎస్)కే ఓటు గుద్దుతా.. కుల్లంకుల్లా చెపుతున్న. షిప్ట్ టైం అయితాంది. ఇగ బాయిలకు పోదమ్ పాండ్రి..
నువ్వు జెప్పినట్లే నేను ఉపాయం చేస్తున్న అన్న.. మొన్నీ మధ్య చుట్టపోళ్లు ఇండ్లళ్లకు వచ్చినప్పుడు ఆడ కూడా ఇదే ముచ్చట వచ్చింది. కారుణ్య నియామకం కింద నాకు నౌకరి వచ్చింది. దిగుపోయే లోపు సొంతిల్లు కట్టుకుంటా.. నా అసోంటోళ్లు ఎంతో మంది కారుణ్య నియామకం కింద వచ్చినోళ్లు.. ఇప్పుడు మంచిగ బతుకుతుర్రు.. బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు సదివి సాఫ్ట్వేర్ చేసినోళ్లు, మల్టీ నేషనల్ కంపెనీల్లో చేసినోళ్లు కూడా గిప్పుడు వచ్చి కారుణ్య నియామకం చేరుతున్నరు.
ఒకప్పుడు బాయిపని గింత ఈజీగా ఏడుండే.. మా నాన్న నేను చేరుతా అన్నప్పుడు వొద్దు అన్నడు. గా పని నువ్వేడ జేస్తవ్ బిడ్డా.. తట్ట మోసుడు నీతోని కాదన్నడు. కానీ.. ఇప్పుడు తట్ట మోసుడు లేకపాయే.. మిషన్ ఎత్తిపోస్తున్నది గదా.. మిగిలిన పనులు పెద్ద రిస్క్ లేనివి అయ్యేసరికి అందరూ సింగరేణిలో పని ఎక్కాలనుకుంటున్నరు. తెలంగాణ వచ్చినంక బొగ్గుబాయి పని సులువైంది. కారుణ్య ఉద్యోగాలే గాకుండా.. సింగరేణి నౌకర్లలో గూడా 80 శాతం సింగరేణి ప్రాంతంలో ఉన్న యువతకే ఉద్యోగాలు కల్పించిండ్రు.