మంచిర్యాల, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మంచిర్యాల సబ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకొని, పరిహారం చెల్లించని విషయంపై కోర్టు సీరియస్ అయ్యింది. బాధితులకు రూ.2.92 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆర్డీవో కార్యాలయ ఆస్తులను అటాచ్ చేసేందుకు పూనుకుంది. ఈ మేరకు బుధవారం కార్యాలయ ఆస్తులను జప్తు చేసేందుకు కోర్టు సిబ్బంది వెళ్లారు.
అనే క నాటకీయ పరిణామాల అనంతరంపై నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం అన్ని వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లలో చర్చకు రావడంతో గురువారం కోర్టు సిబ్బంది ఆర్డీవో కార్యాలయంలోని సామగ్రి మొత్తాన్ని జప్తు చేశారు. బెంచీలు, కుర్చీలు, కంప్యూటర్లు ఏ ఒక్కటీ వదలకుం డా అన్నింటినీ వాహనంలోకి ఎక్కించి తరలించుకొని వెళ్లారు. దీంతో ఆర్డీవో చాంబర్తో పాటు గదులన్నీ ఖా ళీ అయిపోయాయి. మరి ఇప్పుడు అధికారులు ఏం చేస్తారు.. పరిహారం చెల్లించి సామగ్రి తిరిగి విడిపించుకొని వస్తారా.. లేదా అనేది తేలాల్సి ఉంది. కంప్యూట ర్లు, సీపీయూలు అన్ని తీసుకెళ్లడంతో కార్యాలయంలో పనులన్నీ స్తంభించిపోయాయి. పనుల కోసం కార్యాలయానికి వచ్చిన చాలా మంది తిరిగి వెళ్లిపోయారు.