ఉట్నూర్, అక్టోబర్ 4 : ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహిళలు రంగురంగు పూలతో బతుకమ్మలను పేర్చి శోభాయాత్రగా స్థానిక వినాయక్ చౌక్కు వచ్చి ఆడిపాడారు. అలాగే దుర్గాదేవి శోభాయాత్రను నిర్వహించి స్థానిక గంగన్నపేట చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమిలి మండలాధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి రామారావు, సభ్యులు గంగాధర్, రామిని అనిల్, లింగన్న, శ్యాంసుందర్, గోపాల్ సింగ్, సాయికృష్ణ, శ్రీకాంత్, అంజన్న, శ్రీనివాస్, పాల్గొన్నారు. ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
నార్నూర్, మాన్కాపూర్ గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి అడుగులో అడుగు వేస్తూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. అనంతరం గ్రామాల్లోని చెరువులో నిమజ్జనం చేశారు.
భీంపూర్ మండల సరిహద్దు సమీపంలోని మహారాష్ట్ర కిన్వట్ తాలూకా మాండ్వి, లింగి, కన్కి గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహారాష్ట్ర దుండ్రకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రావుల్వార్ రమేశ్ మంగళవారం తన పాఠశాల లింగితండాలో చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మలను అందంగా తయారు చేసిన చిన్నారులకు బహుమతులు అందజేశారు.