నిర్మల్, జూన్ 7(నమస్తే తెలంగాణ) :తుమ్మలు,తుంగ, పిచ్చిమొక్కలు మొలిచిన చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అటువంటి భూముల్లో బంగారు పంటలు పడుతున్నాయి. బతుకుదెరువు కోసం దుబాయ్, మస్కట్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలు తిరిగొచ్చి సేద్యం చేసుకుంటూ పిల్లాపాపలతో హాయిగా జీవిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే చెరువులు సబ్బండ, సమస్త కులవృత్తులకు జీవనాధారమై ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతున్నాయి. వ్యవసాయ అనుబంధ వృత్తులైన మత్స్యకారులు, గొల్ల, కురుమ, చేతి వృత్తులు, పాడి పరిశ్రమ వర్ధిల్లుతున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆనవాళ్లు కోల్పోయిన చెరువులు.. మిషన్ కాకతీయతో పునరుద్ధరణకు నోచుకొని జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా లక్షల ఎకరాల పంట భూములు సాగులోకి వచ్చాయి. సర్కారు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో చెరువుల్లో పెంచుకొని ఉపాధి పొందుతూ మత్స్యకారులు మెరుగైన జీవనం సాగిస్తున్నారు.
గత పాలకుల హయాంలో చారిత్రక చెరువుల రూపురేఖలన్నీ కనుమరుగయ్యే స్థితికి చేరాయి. అప్పట్లో వ్యవసాయానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న ఈ చెరువులు.. పాలకుల ఆలనా పాలనకు నోచుకోక అస్థిత్వం కోల్పోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సీఎం కేసీఆర్ ఈ చారిత్రక చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. చెరువులన్నింటికీ పూర్వ వైభవం కల్పించి పంట పొలాలకు అదనంగా సాగునీరందించాలన్న సంకల్పంతో 2015లో ‘మిషన్ కాకతీయ’ పథకానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి దశలవారీగా మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల రూపురేఖలను మార్చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మిషన్ కాకతీయ పథకంతో గతంలోని ఆయకట్టుకు అదనంగా సాగులోకి వచ్చింది. చెరువుల కింది ఆయకట్టు రైతులు ఊహించని రీతిలో మిషన్ కాకతీయ పథకం వారిలో ఆనందాన్ని నింపింది. చెరువులన్నింటికీ మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టడంతో వాటి నీటి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గొలుసుకట్టు చెరువుల రూపురేఖలు మిషన్ కాకతీయతో మారిపోయాయి. చెరువుల ఆధునీకరణ పనులన్నీ పూర్తి కావడంతో మూడు కాలాల పాటు ఆయా చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రజలంతా చెరువు పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. చెరువు గట్లపై పోచమ్మ, మైసమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు.
అదనంగా లక్ష ఎకరాలు సాగులోకి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మిషన్ కాకతీయ ద్వారా 1,388చెరువులకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టారు. దీంతో ఆయా చెరువుల కింద బీడుగా ఉన్న భూములు సైతం సాగులోకి వచ్చాయి. చెరువులను పునరద్ధరించుకోవడం, కొత్త చెరువులను తవ్వడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,07,480 ఎకరాలు అదనంగా సాగుకు నోచుకున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడుతల్లో రూ.371 కోట్లను ఖర్చు చేసింది. కాగా, నిర్మల్ జిల్లాలో రూ.41 కోట్లతో మొత్తం 410 చెరువులను బాగు చేయగా, ఆయా చెరువుల కింద అదనంగా 7,480 ఆయకట్టు పెరిగింది. భూగర్భ జలాలు రెండు మీటర్ల మేర పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు విడుతల్లో మొత్తం 219 చెరువులకు మరమ్మతులు చేపట్టారు. ఇందుకోసం రూ.152 కోట్లు ఖర్చు చేశారు. కాగా వీటిలో కొన్ని కొత్త చెరువులు కూడా ఉన్నాయి. ఆయా చెరువుల కింద సుమారు 40వేల ఎకరాలు సాగవుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ కింద రూ.96 కోట్లతో 389 చెరువులను ఆధునికీకరించారు. దీంతో ఆయా చెరువుల కింద పడావుగా ఉన్న 35 వేల ఎకరాలు సాగుబడిలోకి వచ్చాయి. మంచిర్యాల జిల్లాలో రూ.82 కోట్లతో 370 చెరువులను పునరుద్ధరించారు. దీంతో ఆయా చెరువుల కింద అదనంగా 25వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి.
పుష్కలంగా భూగర్భ జలాలు..
మిషన్ కాకతీయతో ఆధునికీకరణకు నోచుకున్న చెరువుల కారణంగా భూగర్భ జలాల శాతం గణనీయంగా పెరిగింది. గతంలో పాతాళంలోకి పడిపోయిన భూగర్భ జలాలు ప్రస్తుతం పైపైకి ఉబికి వస్తున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలోనూ భూగర్భ జలాలు తగ్గక పోతుండడానికి కారణం మిషన్ కాకతీయ పథకమేనని రైతులు గర్వంగా చెబుతున్నారు.
మత్స్యకారుల జీవితాలకు భరోసా..
మిషన్ కాకతీయతో మూడు కాలాల పాటు చెరువుల్లో నీటి నిల్వలు ఉండడం మత్స్యకారులకు వరంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 29,099 మంది మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. గత ఉమ్మడి ఆంద్రప్రదేశ్ పాలనలో చెరువులను పట్టించుకోని కారణంగా మత్స్యకారులు ఉపాధి కోల్పోయి వలసలు వెళ్లిన సందర్భాలున్నాయి. ఇలా వలసలు వెళ్లిన కుటుంబాలన్నీ మిషన్ కాకతీయ పథకంతో తిరిగి తమ గ్రామాలకు చేరుకొని చెరువుల్లో చేపల వేటను సాగిస్తూ ఉపాధి పొందుతున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 214 మత్స్య సహకార సంఘాలు పని చేస్తున్నాయి. వీటిలో 62 మహిళా సంఘాలు, మూడు గిరిజన సహకార సంఘాలు, ఒక మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఈ సారి కొత్తగా ఆయా సంఘాల నుంచి మరో 200 మందికి సభ్యత్వాలు ఇచ్చారు. మొత్తం 214 సంఘాల్లో 13,300మంది సభ్యులు ఉండగా, వీరిలో 3500 మంది మహిళలున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలోని 410 చెరువుల్లో చేపల వేట సాగిస్తూ 13,300 మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. ఆదిలాబాద్లో 4300 కుటుంబాలు చేపల వేట ద్వారా ఉపాధి పొందుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 55 మత్స్యకార సంఘాలున్నాయి. ఆయా సంఘాల్లో 2,694 మంది సభ్యులు ఉన్నారు. సుమారు 5వేల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో 114 మత్స్యకార సంఘాలుండగా, 6,499 మంది సభ్యులున్నారు. మిషన్ కాకతీయతో ఏడాది పొడవునా చెరువుల్లో నీరు ఉండడంతో మత్స్యకారుల జీవనోపాధికి ఢోకా లేకుండా పోయింది. ఎంతో ముందు చూపుతో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్న తమ లాంటి వారికి భరోసా దొరికిందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తుల వారికి న్యాయం చేస్తున్నది. గ్రామాల్లోని చెరువుల్లో ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలను వదిలి మత్య్సకారుల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నది. మత్య్సకారుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతను ఇస్తున్నది. గ్రామాల్లోని చెరువుల్లో చేప పిల్లలను వదలడం ద్వారా మాకు ఉన్న ఊర్లనే ఉపాధి దొరుకుతున్నది. గతంలో సొసైటీలో ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం మత్య్సకారులకు టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను అందజేసింది. చేపలను నిల్వ ఉంచడానికి ప్లాస్టిక్ డబ్బాలను అందించింది. ప్రస్తుతం ప్రమాదవశాత్తు ఏమైనా జరిగి మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రమాద బీమా పథకాన్ని సైతం ప్రవేశ పెట్టింది. మత్స్యకారుల అభ్యున్నతి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మత్స్యకారుల తరఫున కృతజ్ఞతలు.
– పల్లికొండ నాగరాజు, మత్య్సకారుడు, గొడిసెర్యాల
రెండు పంటలు పండిస్తా..
దస్తురాబాద్, జూన్ 7 : నా పేరు మొగిలి మల్లేశ్. మాది మున్యాల గ్రామం. నాకు మా ఊరి చెరువు కింద దాదాపు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి పండిస్తా. మిషన్ కాకతీయ పథకం ద్వారా మా ఊరి చెరువును బాగు చేశారు. ఇప్పుడు మా చెరువులో పుష్కలంగా నీరుంటున్నది. నేను ఏడాదిలో రెండు పంటలు తీస్తా. దాదాపు రూ.1.50 లక్షల ఆదాయం వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రాక ముందు చెరువులు అధ్వానంగా ఉండేవి. పూడిక మట్టితో నిండి నీరు నిలిచేది కాదు. ఎండాకాలం వచ్చిందంటే చెరువు మైదానాన్ని తలపించేది. సీఎం కేసీఆర్ సార్ మిషన్ కాకతీయ పథకం ప్రవేశ పెట్టి మా చెరువును బాగు చేసిండు. ఎండాకాలంలోనూ ఫుల్లుగా నీళ్లుంటున్నయ్. ఇప్పుడు చెరువు కింద రైతులందరం సంతోషంగా పంటలు పండిస్తున్నం. సీఎం కేసీఆర్కు రైతులందరం రుణపడి ఉంటాం.
సాగు విస్తీర్ణం పెరిగింది..
తాంసి, జూన్ 7 : చెరువుల పండుగ మా కట్ట మైసమ్మ తల్లి పోచమ్మ గుడి వద్ద చేస్తున్నాం. నాకు పొన్నారిలో మూడెకరాల భూమి ఉంది. సాగునీరు లేక గతంలో ఇబ్బందులు పడేవారం. చెరువులు పూర్తిగా నిండడంతో పంటలకు సాగునీటి కరువు తీరింది. చెరువు ఆయకట్టు కింద భూగర్భజలాలు పెరిగి పంటలు సాగు చేయడానికి అనువుగా ఉంది. వానకాలంలో కూడా పూర్తి పంటలు సాగు చేయలేని స్థితి నుంచి ఏడాదికి రెండు పంటలు పండించుకునే స్థాయికి రైతులను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది.
– మలపతి మల్లయ్య, రైతు, పొన్నారి, తాంసి