కడెం, జూలై 24: నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి సంబంధించి 18 గేట్లకు గానూ అందులోని నంబర్ 1, 3, 16, 18 గేట్లు మోరాయించడంతో ఇటీవల వచ్చిన వరదకు ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కడెంకు చేరుకొని పరిస్థితిని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. సోమవారం గేట్ నంబర్ 1, 3 సంబంధించిన కౌంటర్వెయిట్, రూప్స్ పనులు పూర్తి చేసి పరీక్షించారు. గేట్లు కిందికి, పైకి లేవడంతో పాటు మొత్తం 15 ఫీట్ల మేరకు సమగ్రంగా పని చేస్తున్నదని అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదను మరమ్మతులు చేపట్టిన గేట్ల ద్వారానే నీటిని దిగువకు విడుదల చేశారు.
కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా ప్రస్తుతం 691.125 అడుగులు (5.497టీఎంసీల) వద్ద ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 15966 క్యూసెక్కుల వరద రావడంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి 22012 క్యూసెక్కుల నీరు దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ గేట్ల మరమ్మతుల పనులను ఆయకట్టు ఈఈ విఠల్ పరిశీలించి డీఈ, జేఈలతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాత 14 గేట్లతో పాటు, నంబర్ 1, 3 గేట్ల మరమ్మతులు పూర్తయి మొత్తం 16 గేట్లు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. మిగిలిన 16, 18 గేట్లకు సంబంధించిన పనులు మంగళవారం నుంచి ప్రారంభిస్తామని, ఈ నెల 26వ తేదీన హైదరాబాద్, ఢిల్లీ నుంచి ప్రతినిధులు, స్కాడా అధికారులు ఇక్కడికి చేరుకోనున్నట్లు వెల్లడించారు. వారి సూచనల మేరకు కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మతు పనులు మరింత పటిష్ఠంగా చేపడుతామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ఫ్లోను 4 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తూ పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.