తాండూర్ : రైతులు యూరియా వాడకాన్ని ( Urea Usage ) తగ్గిస్తే నేల తల్లికి ఎంతో మేలని బెల్లంపల్లి ఏడీఏ రాజ నరేందర్, డాక్టర్ యం రాజశేఖర్, డాక్టర్ ష్రైన్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం , వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ( Narsapur Village ) రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా వాడకం తగించడం వల్ల నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. సాగు నీటిని ఆదా చేయడం, పంట మార్పిడి చేయడం వలన చీడపీడలను తగించవచ్చని సూచించారు. ఈ ప్రాంతంలో పత్తి, జొన్న, మొక్కజొన్న సాగుకు అనుకూలమని,పప్పు దినుసుల పంటలైన పెసర, మినుములు, కూరగాయల పంటలు సాగు చేయాలన్నారు.
చెట్లను పెంచడం వలన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. రసాయనాలను అవసరాన్ని బట్టి వాడటంతో పాటు రశీదులను భద్రపరుచుకోవాలని సూచించారు. వరిలో సన్న గింజ రకాలు, వాటి లక్షణాలు, పాటించాల్సిన పద్ధతులను వివరించారు. సంప్రదాయ పంటలతో పాటు ఇతర వాణిజ్య పంటలు (ఆయిల్ పామ్) సాగు చేసి రైతులు ఆర్థికంగా వృద్ధి చెందాలన్నారు. సర్పంచ్ ప్రభాత్ రావు, ఉప సర్పంచ్ పర్బత్ రావు, ఏఈవో వెంకటేష్, పంచాయతీ సెక్రటరీ జగదీష్, గ్రామ ప్రతినిధులు, రైతులు, యువకులు, పాల్గొన్నారు.