మంచిర్యాల, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వీరప్పన్ ఎవరో తెలుసు.. కానీ ఈ సిరోంచ వీరప్పన్ ఎవరనుకుంటున్నారా..? స్మగ్లర్ వీరప్పన్ లాగే.. ఇక్కడ రేష న్ దందాలో వీరన్న కూడా అంతే ఫేమస్. అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ రాష్ర్టాల్లోని సగం జిల్లాలను శాశించే ఈ మాఫియా డాన్ పేరు చెబితే చాలు అధికారులకు వణుకు పుడుతుందట. వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని ఆడించడంలో సిద్ధహస్తుడని అధికారులే చెబుతుండడం గమనార్హం. ఉన్నత స్థాయి అధికారులు మొదలు.. కిందిస్థాయి సిబ్బంది దాకా మామూళ్లు ముట్టజెప్పి పనులు చేయించుకోవడం.. కాదని బెట్టు చేస్తే చేయాల్సింది చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అంటుంటారు.
రేషన్ దందాలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్న వీరన్న(రేషన్ దందా వీరప్పన్ అని పిలుస్తుంటారు)కు ఏ నెల బియ్యం.. ఏ జిల్లాకు ఎంత అలాటయ్యిందో రాష్ట్రస్థాయి నుంచి ముందే తెలుస్తుందట. అందులో మన వ్యాపారానికి ఎంత వస్తుందనే ఎస్టిమేషన్ కూడా ఆయన ముందే సిద్ధం చేసుకుంటారని తెలిసింది. రేషన్ డీలర్లతో నేరుగా ఒప్పందం చేసుకుంటారట. రేషన్ కోసం వచ్చే లబ్ధిదారులకు సదరు డీలర్లు కిలోకు రూ.15 ఇచ్చి కొనుగోలు చేసి, వీరన్నకు రూ.22కి అమ్ముకుంటారు. అదే రేషన్ డీలర్ కాకుండా బయట కొనుగోలు చేసే ప్రైవేటువాళ్లు రూ.18కి కిలో చొప్పున కొనుగోలు చేసి అదే వీరన్నకు రూ.22కు అమ్ముకుంటారు.
ఇలా ఒక మంచిర్యాల జిల్లా నుంచే ప్రతి రోజూ మూడు లారీలు లేదా నాలుగు నుంచి ఐదు డీసీఎం వ్యాన్ల బియ్యం తరలిపోతుంటుంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి ఇలాగే లోడ్లు వస్తాయి. సిరోంచ గ్రామంలో ఎన్హెచ్-63కి పక్కనే ఉన్న వీరన్న గోదాంకు వెళ్తాయి. అక్కడ ఎప్పుడు చూసినా లారీలు, డీసీఎం వ్యాన్లు, చిన్న చిన్న ఆటోలు వచ్చి లోడింగ్.. అన్లోడింగ్ చేస్తూను ఉంటాయి. ఇక్కడి నుంచి ఈ బియ్యం మహారాష్ట్ర మార్కెట్లోకి వెళ్తుంది. రోజూ చిన్న చిన్న వాహనాల్లో గల్లీలన్నీ తిరుగుతూ రేషన్ బియ్యం కొనుగోలు చేశాక.. రాత్రికి వాటన్నింటిని లారీలు, డీసీఎం వ్యాన్లలోకి ఎక్కిస్తారు. రాత్రికిరాత్రే అవి తెలంగాణ దాటుకొని కోటపల్లి మండలం ప్రాణహిత మీదుగా పక్కనే ఉన్న సిరోంచకు వెళ్లిపోతాయి.
ఈ దందా ఎన్ని జిల్లాల్లో నడుస్తుందో అన్ని జిల్లాల్లో కిందిస్థాయి అధికారి నుంచి పైస్థాయి వరకు అధికారులకు ముడుపులు ముడుతాయి. నెల జీతమైన లేట్ అవుతుందేమో కానీ.. వీరన్న మామూళ్లు మాత్రం టైమ్కు వస్తాయి. అందుకే రేషన్ బియ్యం కండ్ల ముందే తరలిపోతున్నా అధికారులకు కనిపించదు. ఇక రేషన్ దందాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించే సివిల్ సప్లయ్ అధికారులకు పెద్ద మొత్తంలో డబ్బులు ముడతాయని తెలుస్తున్నది. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడో, ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడో పట్టుకోక తప్పని సరి పరిస్థితి వస్తే తప్ప అధికారులు ఆ రేషన్ బియ్యం దోచుకుపోయే వాహనాలను పట్టుకోరు. ఏం చేసినా తప్పదనుకున్నప్పుడు డీసీఎంలు, లారీలు, బొలెరోలను వదిలేసి చిన్నచిన్న ఆటోలను పట్టుకుంటారు. ఆ ఆటోల మీద కేసులు పెడతారు.
కోసమెరుపు ఏమిటంటే ఇలా పట్టుకున్న ఆటోలను కూడా చివరకు వీరన్నే విడిపిస్తాడు. ఇలా అన్ని పక్కా ప్లానింగ్ ప్రకారం.. ఎవరికీ అనుమానం రాకుండా జరిగిపోయాయి. మంచిర్యాల జిల్లాలోనైతే రెవెన్యూ శాఖలో ఓ ఉన్నతాధికారికి ప్రతి నెలా రూ.2 లక్షలు, సివిల్ సప్లయ్ శాఖలో రూ. లక్ష ముడుతుందనే టాక్ ఉంది. ఇక రెవెన్యూశాఖ మండలాధికారులకు నెలకు రూ.30 వేలు, పోలీసులకైతే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు అందుతాయని విశ్వసనీయ సమాచారం. ఇదే తరహాలో మిగిలిన జిల్లాల అధికారులకు సైతం మామూళ్లు అందజేస్తారని వీరన్న అనుచరులే చెప్తున్నారు.
రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వాహనం బయల్దేరగానే దాని పరిధిలోని సివిల్ సప్లయ్, రెవెన్యూ, పోలీసు అధికారులకు బండి నంబర్ సమాచారం అందిస్తారు. ఇక ఆ బండి సాఫీగా సిరోంచ వెళ్లేలా మనోళ్లు సహకరిస్తారు. కాకపోతే టాస్క్ఫోర్స్, విజిలెన్స్ అధికారుల భయానికి రేషన్ బియ్యం తరలించే వాహనం ముందు ఒక ఎస్కార్ట్లా టూ వీలర్ వెళ్తుంది. ఎక్కడైనా అధికారులు ఉన్నారా.. ఎవరైనా ఆపుతున్నారా.. అని చూసుకుంటే అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే వాహన డ్రైవర్కు సమాచారం ఇస్తారు. అధికారి ముందు తనిఖీ చేస్తున్నాడని తెలిస్తే చాలు వాహనం వేరే రూట్ తీసుకొని వెళ్లడమో లేక అధికారులు అక్కడి నుంచి వెళ్లే వరకు ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో ఆగి వెళ్లడమో జరుగుతుంటుంది.
రేషన్ అక్రమ రావాణా చేసే వాహనాలను పట్టుకున్నారంటే అది ఏ టాస్క్ఫోర్స్ అధికారులో, విజిలెన్స్ అధికారులో పట్టుకుంటారు తప్పితే జిల్లాస్థాయి అధికారులు పట్టుకోరు. ఇంత పకడ్బందీగా రేషన్ అక్రమ దందా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం పలు విమర్శలకు తావిస్తున్నది. పైగా ఇలాంటి వ్యక్తిని ఇటీవల చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కలవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం ఈ అక్రమ రేషన్ దందాపై దృష్టిసారించాలని, ఇందులో భాగస్వాములైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందిస్తారా.. లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.