ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వరద ప్రాంతాలను పరిశీలించారు. బాధితులకు మేమున్నామనే భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరదలతో పలు కాలనీలు జలమయం కాగా.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రాజెక్టుల నుంచి వరద వచ్చే ప్రాంతాలు, గోదావరి నదీ పరీవాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. ఆటోల ద్వారా ప్రచారం చేస్తూ.. ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణమే తెలియజేయాలని సూచిస్తున్నారు. బల్దియాల ద్వారా ట్రాక్టర్లు ఏర్పాటు చేసి సామగ్రి, జనాలను పునరావాస కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. అక్కడే బస, భోజన వసతి కల్పిస్తున్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు రామన్న, రేఖానాయక్, కలెక్టర్లు, ఎస్పీలు ప్రజాప్రతినిధులు లో తట్టు ప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ సహాయ సహకరాలు కోరుతున్నారు. సర్కారు కూడా మూడు జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది. కాగా.. సింగరేణి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. చింతలమానేపల్లిలోని వరదలో చిక్కుకొని రైతు మృతి చెందాడు.
మంచిర్యాల, జూలై 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టుల నుంచి నీరు వచ్చే ప్రాంతాలు, గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. కొన్ని రోజులుగా మోస్తరు వానలు కురిసినా బుధవారం రాత్రి నుంచి గు రువారం ఉదయం వరకు ఈ సీజన్లోనే భారీ వర్షాలు పడ్డాయి. మంచిర్యాల జిల్లా లో 82.9 మి.మీ కాగా.. ఈ సీజన్లోనే ఇది భారీ వర్షమని అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలో 118.4 మి.మీ, నస్పూర్లో 131.3 మి.మీ వర్షం పడింది. దీంతో పలు కాలనీలు సహా రోడ్ల మీదకు వరద చేరింది. కొన్ని గంటలపాటు అంతరాయం కలిగించినా కాసేపటికి సర్దుకుంది. లక్షెట్టిపేటలో 123.1, దండేపల్లిలో 120.6, జైపూర్లో 118.9, హాజీపూర్లో 111.4, జన్నారంలో 102.7 మి.మీ వర్షం పడింది. నిర్మల్ జిల్లాలో 109.6 మి.మీ సగటు వర్షపాతం నమోదు కాగా.. నిర్మల్ జిల్లా కేంద్రంలో 212.6 మి.మీ, నిర్మల్ రూరల్ ఏరియాలో 143.6 మి.మీ వర్షం పడింది. నిర్మల్ పట్టణంలోని కొన్ని ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. సారంగాపూర్లో 164.6, పెంబిలో 159.6, మామడలో 144.8, లక్ష్మణచాందలో 139.8, సోన్లో 122.6 మి.మీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. జిల్లా సగటు వర్షపాతం 154.9 మి.మీగా నమోదైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సగటు వర్షపాతం 91.0 మి.మీ. కాగా సిర్పూర్(యూ)లో 174.5, దహెగాంలో 150.3, లింగాపూర్లో137.4, పెంచికల్పేటలో 137.2, జైనూర్లో 120.1 మి.మీ. వర్షపాతం నమోదైంది.
అప్రమత్తమైన యంత్రాంగం
భారీ వర్షాలతో జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు దగ్గర బుధవారం ఉదయం ప్రమాదకర పరిస్థితి కనిపించింది. ఇన్ ఫ్లో 3.86 లక్షల క్యూసెక్కులు దాటడంతో ప్రాజెక్టు గేట్ల మీద నుంచి వరద వెళ్లింది. దీంతో మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. గతేడాది కడెం గండిపడడం, ఎల్లంపల్లి నుంచి భారీ వరద రావడంతో మంచిర్యాల పట్టణంలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. అదే పరిస్థితి ఎక్కడ పునరావృతం అవుతుందోనని ఆందోళన ఏర్పడింది. కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వదిలిన నేపథ్యంలో లోతట్టు ప్రాం తాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జన్నారం మండలంలోని రోటి గూడ, కలమడుగు, ధర్మారం, బాదంపెల్లి, చింతగూడ, తపాలాపూర్, తిమ్మాపూర్, రాంపూర్ గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ కిషన్ రోటిగూడ గ్రామానికి వెళ్లి వరదతో ముందుగా ఎఫెక్ట్ అయ్యే 30 కుటుంబాల ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మరోవైపు మీద ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కడెం నుంచి ఇటు ఎస్సారెస్పీ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ 32 గేట్లను ఎత్తి 5.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. రాళ్లవాగు గోదావరిలోకి వెళ్లకుండా నీరు తిరిగి వెనక్కివస్తే జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్నగర్, రాంనగర్ పూర్తిగా మునిగిపోతాయి. ఈ మేరకు బుధవారం రాత్రి నుంచే ఈ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆటోలు ఏర్పాటు చేయించి వరద ప్రభావిత ప్రాంతం మొత్తం చెప్పిస్తున్నారు. గురువారం ఉదయం గోదావరి ప్రవా హం పెరగడంతో రాళ్లవాగు వేగం తగ్గింది. ఏ క్షణమైనా నీరు వెనక్కి వచ్చే అవకాశం ఉందని ఎన్టీఆర్ నగర్లోని ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులే ఆటోలు, మున్సిపాలిటీ ట్రాక్ట ర్లు ఏర్పాటు చేసి, ప్రజలను పునరావాస కేం ద్రానికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతాలతోపాటు సాయికుంట, ఆదిత్య ఎన్క్లేవ్ లాంటి ముంపు ప్రాంతాల వాసులు సురక్షిత ప్రాం తాలకు తరలిపోవాలని సూచించారు. పాఠశాలలకు సర్కారు శుక్రవారం సెలవు ప్రకటించింది.
పర్యటించిన అధికారులు, నాయకులు..
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాం తాలను అధికారులు పరిశీలించారు. గురువారం ఉదయమే కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యే దివాకర్రావు ఎన్టీఆర్ నగర్, రాంనగర్లో పర్యటించారు. రాళ్లవాగు వరద పరిస్థితిని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ప్రమాదం పొంచి ఉన్న దృ ష్ట్యా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాహుల్, అసిస్టెంట్ కలెక్టర్ గౌతమి, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఎంఆర్వో రాజేశ్వర్తో కలిసి మధ్యాహ్నం రాళ్లవాగును పరిశీలించారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ తెలిపారు. ఎన్టీఆర్ న గర్కు చెందిన దాదాపు 500 మందికి మంచిర్యాలలోని భవన నిర్మాణ సంఘం హాల్లో పునరావాస ఏర్పాట్లు చేశామన్నారు. అందరికీ భోజనంతోపాటు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాళ్లవాగు పక్కనున్న పెద్దమ్మగుడి లోకి ఎవరూ రాకుండా వెం టనే తాళాలు వేయాల ని, వాగును ఆనుకొని ఉన్న ఇండ్లను తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు సూ చించారు. దండేపల్లి మండలం ద్వారక గ్రామంలో నూ ముంపు ప్రాంతాల ప్రజలను పో లీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీరాంపూర్ ఓసీపీ లో పది రోజులుగా వర్షం కురుస్తుండడంతో 88 వే ల టన్నుల ఉత్పత్తి నిలిచింది. ఓసీపీ క్వారీలో మట్టి తవ్వకాలు, రవాణా(ఓబీ) పూర్తిగా నిలిచాయి.
ముగ్గురు ప్రత్యేక అధికారులు
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వరద బాధిత జిల్లాకుప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులు వచ్చారు. నిర్మల్కు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ముషారఫ్ అలీ ఫా రూఖీ, మంచిర్యాలకు మహిళా, శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ భారతీ హోళికేరి, ఆసిఫాబాద్కు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్కు చెందిన హన్మంతరావును స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది. వ రదకు సంబంధించి ఇబ్బ ందులుంటే జిల్లా కేంద్రంలోని హెల్ప్లైన్ నంబర్లతోపాటు సెక్రటేరియట్లో ని స్పెషల్ కంట్రోల్ రూ మ్కు ఫోన్ చేయవచ్చని సూచించారు. 79979 50 008, 79979 5978 2, 040-23450779 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది.
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గేట్లపై నుంచి వరద వెళ్తుండడంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ వరుణ్రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. కడెం గ్రామాన్ని ఖాళీ చేయించి.. కడెం, దస్తురాబాద్ మండలాల్లోని 12 గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు.
మామడ మండలం పొన్కల్ గ్రామం నీట మునిగింది. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భైంసా మండలంలోని గుండేగాం నీట మునగడంతో ప్రజలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కుభీర్ మండలంలో 1983 సంవత్సరం తర్వాత భారీ వర్షం కురిసింది. మండలంలోని పార్డి(బీ)కి చెందిన రాజు, జితేందర్, యోగేశ్ ద్విచక్రవాహనంపై వెళ్తూ గుండమర ఒర్రె వద్ద వరదలో కొట్టుకుపోయారు. రాజు చెట్టుపైకి ఎక్కగా, మిగతా ఇద్దరు చెట్ల పొదలను పట్టుకున్నారు. రాజు గ్రామస్తులకు ఫోన్ చేయడంతో కాపాడారు. కుభీర్ మండలంలోని 135 ఏండ్ల చరిత్ర గల సిరాల చెరువు కట్టకు గండి పడడంతో గుట్టపై ఉన్న శివాలయంలో ప్రజలు తలదాచుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తరణం బ్రిడ్జి వద్ద వాగు ఉధృతిని ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించారు.
భైంసా బస్ డిపోలోని వరదలో చిక్కుకున్న ఎనిమిది మంది సిబ్బందిని డీఎం అమృత, సీఐ శ్రీనివాస్ కాపాడారు.