ఎదులాపురం/బోథ్, జూలై 24: నీట్ పేపర్ లీకేజీ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు మేరకు శుక్రవారం ఆదిలాబాద్లో పలు విద్యాసంస్థల వద్ద ఆందోళనలు జరిగాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తుగానే సెలవులు ప్రకటించాయి. విద్యానగర్లోని గజిటెడ్ నంబర్-1 పాఠశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిను ఖండిస్తూ నినాదాలు చేశారు. పాత బస్టాండ్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. అనంతరం ప్రధాన గేటు ఎదుట ధర్నా చేశారు. ఈ ఆందోళనల్లో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బుట్టి శివకుమార్, డీవైఎఫ్ఐ జిల్లా కో-కన్వీనర్ అన్నమొల్ల కిరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఇషాంత్, కపిల్, కేశవ్, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. బోథ్ మండలంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు బంద్లో పాల్గొన్నాయి. నిరసనలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మున్సిఫ్, ప్రేమ్, ప్రశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉట్నూర్, జూలై 24: విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడకూడదని ఉట్నూర్ మాజీ జడ్పీటీసీ చారులత అన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు చేసిన దాడులను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జూలై 24: నీట్ పరీక్ష నిర్వహణలో విఫలమైన ఎన్టీఏను రద్దు చేయాలని నిర్మల్ జిల్లాలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న 21 కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా ఉపాధ్యక్షుడు షోయబ్ మిర్జా డిమాండ్ చేశారు.