ఎదులాపురం, నవంబర్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారిని అక్కడి గుత్తికోయలు హత్యచేయడంపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. అందులో భాగంగా బుధవారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆదిలాబాద్ అటవీ శాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడు గిరయ్య మాట్లాడుతూ.. అటవీ సంపదను కాపాడేందుకు ప్రాణాలను ఫణంగా పెడుతున్నామన్నారు. పోలీసుల మాదిరిగానే తమకూ ఆయుధాలు ఇవ్వాలని కోరారు. దాడి చేసిన వారిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. తమ రక్షణపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. అప్పటి దాకా పోడుభూముల సర్వే గ్రామసభలతో పాటు, విధులను బహిష్కరిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ నాయకులు ప్రశాంత్, రవీందర్, నరేశ్, కేశవ్, అమర్సింగ్, ఎఫ్వోల సంఘం ప్రతినిధి వాహబ్ తదితరులు ఉన్నారు.