ఇంద్రవెల్లి, డిసెంబర్ 15 : ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో వెలిసిన నాగోబాను మెస్రం వంశీయులు తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఏటా పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి నాగోబాకు మహాపూజలు నిర్వహిస్తున్నారు. కాగా, 1942లో చిన్న పూరిగుడిసెలో నాగోబాను ప్రతిష్ఠించి మెస్రం వంశీయులు పూజలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత 1956లో పూరిగుడిసెను తొలగించి, రాళ్లతో ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు అందులోనే నాగోబా పూజలందుకుంది. రాళ్లతో నిర్మించిన ఆలయాన్ని 1977లో తొలగించి, అదే స్థానంలో ఇటుకలతో కొత్తది నిర్మించారు. అప్పటి నుంచి నాగోబా జాతర మరింత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
ఆ తర్వాత 1995 సిమెంట్ ఇటుకలతో మరోసారి కొత్త ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి 27 ఏండ్లు అదే ఆలయంలో పూజలు కొనసాగుతూ వచ్చాయి. ఇదే ఆలయాన్ని 1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సందర్శించి, నాగోబాను దర్శించుకున్నారు. నాగోబా జాతర వైభవాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఆలయాన్ని కూడా 2018లో తొలగించారు. ఆదే స్థానంలో ప్రత్యేక రాయితో ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు. దీనికోసం ప్రత్యేకంగా విరాళాలు సేకరించి, అత్యద్భుతంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు.