కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : వరి సాగులో దహెగాం మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. చీడ పీడల నుంచి పంటలను కాపాడేందుకు వాడే రసాయన ఎరువుల తయారీలో వినియోగించే వరిని ఇక్కడ పండిస్తారు. ఈ వరి సాగుకు కావాల్సిన విత్తనాలు అందించడం మొదలు.. పంట కొనుగోలు చేసే వరకూ.. అన్నీ ఫెస్టిసైడ్స్ కంపెనీలే చూసుకుంటాయి. ఏడెనిమిదేళ్ల క్రితం సుమారు 20 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ ప్రత్యేక వరి సాగు.. నేడు 3 వేల ఎకరాలకు చేరడం గమనార్హం. ఈ పంట పండించే రైతులు నాలుగు నెలల్లోనే ఎకరానికి సుమారు రూ. 50 వేలకు పైగా లాభం పొందుతారు.
3 వేల ఎకరాల్లో సాగు..
దహెగాం మండలంలోని దహెగాం, కొంచెవెల్లి, పంబాపూర్, ఒడ్డుగూడ, లగ్గాం, కల్వాడ, సాలిగాం, మావవెల్లి తదితర గ్రామాల్లోని భూములు ఈ రకమైన వరి సాగుకు అనుకూలంగా ఉన్నాయి. నల్లరేగడి, చెలక నేలలు ఈ ఆడ-మగ వరి సాగుకు అనుకూలమైనవి. ఈ విషయాన్ని గమనించిన బేయర్, పయనీర్వంటి ప్రముఖ కంపెనీలు ఈ వరిసాగును ప్రోత్సహిస్తున్నాయి. రైతులకు కూడామంచి లాభాలుండడంతో ఆసక్తిచూపుతున్నారు. ఈ ప్రత్యేకమైన వరి విత్తనాలను సరఫరా చేస్తున్న బేయర్, పయనీర్వంటి ప్రముఖ కంపెనీలు పంట వేసినప్పటి నుంచి చేతికందే వరకు పర్యవేక్షిస్తుంటాయి. వానకాలం పంటలు ముగిసిన తర్వాత రబీలో మాత్రమే సాగుచేసే ఈ ఆడ, మగ వరిసాగును మొదట దహెగాం మండలంలోని కొన్ని ప్రాంతాల్లో చేపట్టారు. ఏడెనిమిదేళ్లక్రితం మొదట 20 ఎకరాల్లో సాగు చేయగా, ప్రస్తుతం మండలంలో దాదాపు 3 వేల ఎకరాల్లో సాగవుతోంది. 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. జనవరి మొదటి వారం నుంచి 20వ తేదీలోపు మాత్రమే వరి నాటు వేయాలి. మూడు వరుసలు ఆడ వరి నారు నాటిన తర్వాత.. ఒక వరుస మగ వరినారు నాటుతారు. వరి మడిలో నాచురాకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పంటలకు ఎప్పుడు ఎలాంటి మందులు వేయాలి అనే విషయాలను ఫెస్టిసైడ్ కంపెనీల ప్రతినిధులే పర్యవేక్షిస్తారు. పంట వేసిన 90 రోజుల్లో ఆడ-మగ వరి పూత దశ(పొట్టదశ)కు వస్తుంది. ఈ సమయంలో ప్రత్యేక విధానంలో ఆడ, మగ వరిని (క్రాసింగ్ చేస్తారు) కలుపుతారు. ఇలా కలిపిన 20 నుంచి 30 రోజుల్లో పంట కోస్తారు. ఆపై పురుగుల మందుల తయారీలో ఈ వరిని వినియోగిస్తారు.
ఎకరానికి లాభం రూ.50వేల పైనే..
ఆడ, మగ వరి వేసేందుకు ఎకరానికి సుమారు రూ.30 నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి అవసరముంటుంది. ఎకరానికి కనీసం 10 క్వింటా ళ్ల దిగుబడి వస్తుంది. విత్తనాలు సరఫరా చేసిన కంపెనీ వారే రైతుల చేలల్లోకి వచ్చి క్వింటాలుకు రూ. 8 వేల చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తారు. ఖర్చులన్నీ పోను రూ. 50 వేల వరకు ఆదాయం వస్తుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే మరింత దిగుబడి పెరిగే అవకాశముంటుంది.
రూ. 2 లక్షలకు పైగా లాభం..
నేను నాలుగేండ్లుగా ఆడ, మగ వరి సాగు చేస్తున్న. గతేడాది ఐదెకరా ల్లో పంట వేసిన. రూ. 2 లక్షలకు పైనే లాభం వచ్చింది. కంపెనీ వారే విత్తనాలు ఇస్తారు. ఎలా పండించాలో.. ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలో వారే చెబు తారు. పంట చేతికొచ్చిన తర్వాత వారే వచ్చి కొనుక్క పోతారు. ఈ వరిసాగులో మంచి లాభాలే ఉన్నాయి.
– చాపిడి సంతోష్, రైతు, దహెగాం
నాలుగెకరాల్లో సాగు చేస్తున్న
నేను నాలుగెకరాల్లో ఆడ-మగ వరి సాగు చేస్తున్న. ఈ వరిని పురుగుల మందుల తయారీలో వాడుతారని చెబుతున్నరు. మా దగ్గర ఉన్న భూములు ఈ పంటకు అనుకూలంగా ఉన్నాయంటున్నరు. ఈ వరి సాగులో నష్టం వచ్చే ప్రసక్తే లేదు. నీటి వసతి ఉండాలి. పంటను ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఏ సమయంలో ఏం చేయాల్లో కంపెనీ వారే చెబుతారు. పంట పండిన తర్వాత వారే కొనుగోలు చేస్తారు. ఈ వరి తినడానికి పనికి రాదు. కేవలం యాసంగిలో మాత్రమే ఈ పంట పండుతుంది. – మేకల రాజేశ్, రైతు, దహెగాం