ఇచ్చోడ, ఫిబ్రవరి 23 : తపాలా సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బిహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బీ రాజేందర్ అన్నారు. ఇచ్చోడ తపాలా కార్యాలయంలో గురువారం తపాలా పొదుపు మహామేళా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై, మాట్లాడారు. జిల్లాలో తపాలా వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు సిబ్బందిని అభినందించారు. కార్యాలయానికి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
పోస్టు మాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ డాక్టర్ పీవీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. తపాలా సేవలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, పని చేసే సిబ్బందికి నిజాయితీ చాలా అవసరమని పేర్కొన్నారు. అనంతరం నూతన ఖాతా దారులకు పాసు పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తపాలా అధికారి కేబీఆర్ ఆర్ ప్రసాద్, సర్పంచ్ సునీత పాల్గొన్నారు.