మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 14 : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కమ్మర్పల్లి శివారు అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మంచిర్యాల డీసీపీ రాంనాథ్ కేకన్ బుధవారం హత్య కేసు వివరాలను వెల్లడించారు. చెన్నూరు మండలం పొన్నారం గ్రామానికి చెందిన బట్టే పద్మ, బట్టే శేఖర్ దంపతులకు ఇద్దరు పిల్లలు. పద్మకు ఇదే గ్రామానికి చెందిన రామగిరి మహేందర్తో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. నాలుగు నెలల క్రితం మహేందర్, పద్మలు పారిపోయారు. చెన్నూరు పోలీసు స్టేషన్లో భర్త ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది.
తన ఇష్ట ప్రకారమే వెళ్లిపోయానని పద్మ పోలీసులకు తెలిపింది. నాలుగు నెలలుగా కలిసి ఉంటున్న పద్మ, మహేందర్ల మధ్య నెల రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. వేధింపులు అధికం కావడంతో పద్మ కమ్మర్పల్లిలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న మహేందర్ అక్కడికి కూడా వెళ్లి వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయంలో పద్మ తల్లిదండ్రులు మొగిలి ఓదెలు, సుగుణక్కలు కలిసి భర్త శేఖర్తో మాట్లాడి మహేందర్ను అడ్డు తొలిగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న పథకం ప్రకారం పద్మ మంగళవారం రాత్రి తనవద్దకు రావాలని ఫోన్ చేసింది.
ఆమె పిలుపు మేరకు కమ్మర్పల్లికి వెళ్లిన మహేందర్ను పద్మతోపాటు భర్త శేఖర్, ఆమె తల్లిదండ్రులు ఓదెలు, సుగుణక్కలు కర్రలతో తలపై కొట్టి చంపారు. అనంతరం ఎడ్లబండిపై శవాన్ని ఊరు సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించి తగులబెట్టే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న యువకులు విషయాన్ని పసిగట్టి మహేందర్ అన్న రవీందర్కు సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జైపూర్ ఏసీపీ మోహన్ ఆధ్వర్యంలో ఎస్సై మహేందర్, సిబ్బందితో విచారణ చేపట్టారు. బుధవారం నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై హత్యకేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. 12 గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసు అధికారులను, సిబ్బందిని డీసీపీ అభినందించారు.