బెల్లంపల్లి, డిసెంబర్ 4 : బెల్లంపల్లి నియోజకవర్గంలో తాము చేపట్టిన పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ. 5 కోట్లతో మంజూరైన స్టడీ సర్కిల్, అంబేద్కర్ భవన్, రూ. 50 లక్షలతో కళామందిర్, రూ. 50 లక్షలతో టెండర్ ప్రక్రియ దశలో ఉన్న కాంటా ఏరియాలో బస్టాండ్, ఇంటిగ్రేటేడ్ మార్కెట్ను పూర్తి చేయడానికి రూ. 3 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. రూ. ఐదు కోట్లతో పోచమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్, రూ. 5 కోట్లతో పార్కు పనులు ప్రారంభించాలని వెల్లడించారు. 350 ఎకరాల్లో నిర్మిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ను కూడా పూర్తి చేసి పలు కంపెనీలను తీసుకువచ్చి ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి కల్పించాలని సూచించారు. గత పదేండ్లలో కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులు, నియోజకవర్గ ప్రజల దీవెనలు, సహకరించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోనికి తీసుకెళ్లానని గుర్తు చేశారు.
2014 నుంచి ప్రజల అండదండలతో అభివృద్ధికి బాటలు వేశానని తెలిపారు. మూడోసారి టికెట్ రాకుండా కొంతమంది నాయకులు నీచరాజకీయాలకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ తనను గుర్తించి టికెట్ కేటాయించారని పేర్కొన్నారు. డబ్బు, మద్యంతో మాత్రమే వినోద్ గెలిచారని ఆరోపించారు. ఒక ప్రణాళిక బద్ధంగా వినోద్ అధర్మంగా గత ఏడాది నుంచి తనను మానసికంగా దెబ్బతీశారని విమర్శించారు. ప్రజలు నా వెంటే ఉన్నారని చెప్పారు. నైతికంగా తానే గెలిచానని వినోద్ ఓడిపోయారని స్పష్టం చేశారు. ఎస్సీ నియోజవర్గంలో తనను ఓడించడానికి రూ. 100 కోట్లు ఖర్చు పెట్టడమే దీనికి నిదర్శనమన్నారు. ప్రజా తీర్పుకు తాను శిరస్సు వహిస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పటిలాగే 24 గంటలు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా ఏ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల జోలికి వెళ్ల లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి కొన్ని గంటలు కాకముందే బెల్లంపల్లి మండలంలోని పెరకపల్లి సర్పంచ్ భార్య బూదకలాన్లో ఎంపీటీసీ, మెట్పల్లిలో బీఆర్ఎస్ నాయకుడిపై దాడులు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఓపిక పడుతున్నారని వారు తిరగబడితే ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. ఈ దాడులకు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు హుందాగా వ్యహరించాలని సూచించారు. పార్టీ ఓడిపోవడంతో నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా మనోధైర్యం పెంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం వినోద్కు శుభాకాంక్షలతో పాటు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.