పెంబి, అక్టోబర్ 1 : నిర్మల్ జిల్లా పెంబి మండలం నీతి ఆయోగ్ (నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా)కు ఎంపిక కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీతి ఆయోగ్ సూచన మేరకు మండలంలో 11 శాఖలు, 39 అంశాలపై ప్రణాళికలు రూపొందించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. దీని కోసం ఉన్నత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ రూరల్ డెవలప్మెంట్లో రెండు రోజుల పాటు బ్లాక్స్థాయి అధికారులు, ఢిల్లీలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నిర్వహించిన భారత మండపం ప్రాంగణంలో సంకల్ప్ సప్తా కార్యక్రమానికి జడ్పీ సీఈవో సుధీర్బాబు, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, పెంబి సర్పంచ్ పూర్ణచందర్ గౌడ్, మందపల్లి సర్పంచ్ సుధాకర్, ఇటిక్యాల సర్పంచ్ మహేందర్, కోశగుట్ట సర్పంచ్ రాజులు వెళ్లి శిక్షణ పొందారు. నీతి ఆయోగ్ ద్వారా మంజూరైన నిధులతో పాటు మండలంలోని వనరులను సద్వినియోగం చేస్తూ పెంబి మండలాన్ని అభివృద్ధి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, రహదారులు, తాగునీరు, విద్యుదీకరణతో పాటు పలు సదుపాయాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా నీతి ఆయోగ్ కార్యక్రమాలు చేపడుతున్నది. దీంతో అన్ని శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందిస్తుండడంతో పెంబి పురోగతి సాధించనున్నది. మండల కేంద్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో చింతన్ శివర్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు ప్రణాళికలు రూపొందించనున్నారు. పెంబి మండలంను నీతి ఆయోగ్ ఎంపిక చేయడంతో రాబోయే రెండు సంవత్సరాల్లో మండలం అన్ని శాఖల్లో అభివృద్ధి చెందనుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నీతి ఆయోగ్ ఎంపికతో పెంబి అభివృద్ధి
నీతి ఆయోగ్కు పెంబి మండలాన్ని ఎంపిక చేయడంతో మరింత అభివృద్ధి చెందనున్నది. నీతి ఆయోగ్ సూచనల మేరకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిసున్నాం. హైదరాబాద్, ఢిల్లీలో నీతి అయోగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. రాబోయే రెండు సంవత్సరాల్లో మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తాం. మండలంలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించి పెంబి అభివృద్ధికి కృషి చేయాలి
-సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో, పెంబి
నీతి అయోగ్కు పెంబిని ఎంపిక చేయడం అదృష్టం
పెంబి మండలాన్ని నీతి అయోగ్కు ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో, ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా అంశాలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రెండు రోజుల క్రితం నీతి అయోగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప్ సప్తా కార్యక్రమానికి పెంబి మండలం నుంచి పలువురు సర్పంచ్లు వెళ్లి శిక్షణ పొందినాం. నీతి ఆయోగ్ ద్వారా గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం.
-అర్గుల పూర్ణచందర్ గౌడ్, సర్పంచ్, పెంబి