మహేష్ బాబు హీరోగా ‘సర్కారు వారి పాట’చిత్రాన్ని రూపొందించి మంచి విజయాన్ని దక్కించుకున్నారు దర్శకుడు పరశురామ్ పెట్ల. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా ఆ సంతోషాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు దర్శకుడు పరశురామ్ పెట్ల. ఆయన మాట్లాడుతూ…‘మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో ఓ సక్సెస్ఫుల్ సినిమా చేశానన్న సంతృప్తి దక్కింది. సినిమా ఎంత వసూలు చేస్తుందనేది ఆయన స్టార్ డమ్ రేంజ్ను చూపిస్తున్నది. సినిమా విడుదలయ్యాక పరిశ్రమ నుంచి చాలా మంది పెద్దవాళ్లు ఫోన్ చేసి అభినందించారు.
దర్శకుడు సుకుమార్ అయితే ఇలాంటి సినిమా నువ్వే చేయగలవు. పెద్ద స్పాన్ ఉన్న కథను ఎంటర్టైనింగ్గా చూపించావు అన్నారు. గుర్తుండిపోయే ప్రశంస అది. సినిమా మొదటి షో అవగానే మహేష్ ఫోన్ చేసి అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తుందని చెప్పారు. రెండున్నర ఏండ్లు నేను సినిమాకు పడిన కష్టాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి మహేష్ బాబు. పాండమిక్లో నన్ను జాగ్రత్తగా ఉండమని పదే పదే చెప్పేవారు. ఆయన ఆరోగ్యానికి అంత ప్రాధాన్యత ఇస్తారు.
ఇలాంటి పాయింట్తో మన దగ్గర సినిమా రాలేదు. మహేష్ ఈ సినిమా ఒప్పుకోవడానికి కూడా అదే కారణం. నెలవారీ వాయిదాలు కట్టే వారిలో నేనూ ఒకరిని. అందుకే ఈ కథకు వ్యక్తిగతంగా బాగా కనెక్ట్ అయ్యాను. ఎక్కడికి వెళ్లినా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. త్వరలో నాగ చైతన్యతో ఒక సినిమా చేయబోతున్నాను. ఆ చిత్రానికి ‘నాగేశ్వరరావు’అనే టైటిల్ అనుకుంటున్నాం’ అన్నారు