ఎదులాపురం, డిసెంబర్ 7 : తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఓటర్ పరిశీలకుడు శ్రీధర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశీలకుడు మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితాను ఎన్నికల నిర్వహణ నాటికి సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా అవసరమని, యేటా సవరణలు, మార్పులు, చేర్పులు, నమోదు వంటి కార్యక్రమాలు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.
18 ఏండ్లు నిండిన యువతీయువకులు పేర్లు తప్పిపోకుండా నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని తెలిపారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారంతో ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ ప్రచార, అవగాహన కార్యక్రమలు నిర్వహించి ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. జిల్లా జనాభా 7,68,404 కాగా, 6,36,509 మంది ప్రొజెక్టెడ్ జనాభా ఉంటుందని తెలిపారు. 2023 డ్రాఫ్ట్ రోల్ను అసుసరిచి ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో 4,14,937 ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. 582 పోలింగ్ కేంద్రాలు, 582 బూత్స్థాయి అధికారులు, 58 మంది సూపర్ వైజర్లను నియమించినట్లు చెప్పారు. జిల్లాలో 80 శాతం ఎపిక్ కార్డుకు ఆధార్ లింక్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, ఆదిలాబాద్, బోథ్ ఈఆర్వోలు రమేశ్ రాథోడ్, వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషపర్ శైలజ, స్వీప్ నోడల్ అధికారి లక్ష్మణ్, తహసీల్దార్లు నాయబ్ తహసీల్దార్లు, సూపర్వైజర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి ఓటరు జాబి తా పరిశీలకుడు శ్రీధర్ ఈఆర్వో, ఏఈఆర్వోల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్స్థాయి పరిశీలనల ద్వారా ఓటరు నమోదు కార్యక్రమం సజావుగా వందశాతం నిర్వహించవచ్చని తెలిపారు. ఓటర్ల జనాభా నిష్పత్తి పెంచాలని, అందుకు బూత్ స్థాయి సమీక్షలు, పరిశీనలు నిర్వహించాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సంవత్సరంలో 4 సార్లు క్వాలిఫయింగ్ తేదీల్లో ఓటరుగా నమోదు చేయవచ్చని తెలిపారు. ప్రతి స్థాయిలో ఓటరు నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించిన విషయాలపై సిఫారుసులు నమోదు చేయాలన్నారు. అనంతరం రెండు నియోజకవర్గాల్లోని ఏఈఆర్వోల వారీగా సమీక్షించారు.