నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శనివారం నిర్వహించే యాదాద్రి లక్ష్మినర్సింహస్వామి కల్యాణోత్సవం ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలపై యాదాద్రి లక్ష్మినర్సింహస్వామి ఆశీస్సులు ఉండాలనే సంకల్పంతో స్వామివారి కల్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో కనుల పండువగా జరిగే కార్యక్రమానికి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తిలకించాలని కోరారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి. జడ్పీటీసీ జీవన్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి లక్ష్మినర్సింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం ప్రజలు విరాళాలు అందివ్వాలని మంత్రి పిలుపునిచ్చారు.ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకునే భక్తులు స్వచ్ఛంద విరాళాలు ఇవ్వవచ్చని సూచించారు.