కుభీర్, అక్టోబర్ 24: సోయా పడుతూ ఆ యంత్రంలో చిక్కుకుని ఒక వ్యక్తి మృతి చెందాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం, పాత సౌంవ్లీ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సోమనాథ్ (34) అనే వ్యక్తి గత కొంతకాలంగా సోయా నూర్పిడి యంత్రం(Soya Machine) ద్వారా రైతులు పండించిన సోయాలను తీస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలానే శుక్రవారం గ్రామానికి చెందిన సంతోష్ చేనులో సోయా నూర్పిడి చేసేందుకు వెళ్లాడు సోమనాథ్.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో నూర్పిడి యంత్రంలో ఏదో చిక్కుకోవడంతో.. దాన్ని బయటకు తీసే క్రమంలో సోమనాథ్ ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కున్నాడు. అతడు యంత్రంలో చిక్కుకుపోవడం చూసి.. అక్కడే ఉన్న కొందరు వెంటనే యంత్రాన్ని ఆఫ్ చేశారు. కానీ, అప్పటికే సోమనాథ్కు తీవ్ర రక్తస్రావమైంది. తలకు, నడుముకు, చేతులకు తీవ్ర గాయాలపాలై.. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆయనను ఆస్పత్రికి తరలించారు. సోమనాథ్ ప్రమాదానికి గురైన విషయాన్ని గ్రామానికి చెందిన విట్టల్ వెంటనే ఆయన భార్య రుక్మాబాయి(Rukma Bai)కి ఫోన్ చేసి తెలియజేశారు. పెద్దమ్మడుగుల్లో ఉన్న బైసా ఆసుపత్రికి సోమనాథ్ను తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కువిరి ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.