కుభీర్, ఏప్రిల్ 07: సనాతన హిందూ ధర్మం, భగవగ్బక్తి, సమసమాజ స్థాపన కోసం ప్రజలను చైతన్యం చేసేందుకు యువత నడుం బిగించాలని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర ఆలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి జరిగిన హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ముందుగా గోపూజ, సామూహిక కుంకుమార్చన, హనుమాన్ చాలీసా పారాయణం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆలోచింపచేశాయి.
శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ ప్రసంగిస్తూ హిందూ ధర్మ పరిరక్షణతో పాటు ఆలయాల గౌరవాన్ని, పవిత్రతను కాపాడడం, హిందూ సమాజాన్ని బలోపేతం చేసేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత నేటి యువత ఉందని అన్నారు. సామాజిక సామరస్యత కోసం కులాలు, వర్గాలకు అతీతంగా ప్రజలు ఒక్కటైనప్పుడే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి సాధ్యమని ఆయన నొక్కి చెప్పారు. సనాతన ధర్మం, వేద సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేస్తూ యువత ఆధ్యాత్మిక మార్గం అనుసరించాలని స్వామీజీ పిలుపునిచ్చారు.

ధర్మ సందేహాల నివృత్తి, యజ్ఞ, యాగాల ప్రాముఖ్యత అందరికీ తెలిసేలా కీర్తనలు, ప్రవచనాలను వేడుకాగా నిర్వహించడంతోనే ధర్మం నిలబడుతుందని, హిందూ సమాజం ఐక్యతగా ఉంటూ ఆ దిశగా కృషి చేయాలని ఆయన వివరించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ అధ్యక్షులు చిమ్మన్ అరవింద్, స్థానిక సర్పంచ్ కందూరి సాయినాథ్, మున్నూరు కాపు, యాదవ ఆర్యవైశ్య, 18 కుల సంఘాల సభ్యులు ప్రముఖులు, ఆయా గ్రామాల నుండి విచ్చేసిన వందలాదిమంది ప్రజలు, హనుమాన్ మాల ధారణ భక్తులు, యువకులు, మహిళలు, ఆయా మండలాలు, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు.