బోథ్, నవంబర్ 28 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని నారాయణ్పూర్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు జాదవ్ శ్రీనివాస్ ఎంబీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. కరోనా సమయంలో కంపెనీ ఆదేశాల మేరకు వర్క్ ఫ్రం హోం చేశాడు. కంపెనీ వారు ఉద్యోగం నుంచి తొలగించడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. వంశపారం పర్యంగా వచ్చిన నాలుగెకరాల భూమిలో జామ, ఎర్రచందన మొక్కలు నాటాడు. కడప నుంచి మొక్కలు తెప్పించాడు. తైవాన్ లైట్ పింక్ జామ ఒక్కొక్కటి రూ.75 చొప్పున రూ.1.50 లక్షలు పెట్టి 2 వేల మొక్కలు తెప్పించాడు. మరో 2 వేల ఎర్రచందనం మొక్కలు ఒక్కోదానికి రూ.150 చొప్పున రూ.3 లక్షలు కూడా వెచ్చించాడు. ఎర్ర చందనం మొక్కలు ఏపుగా పెరిగి కోతకు రావడానికి 15-20 ఏండ్లు పడుతుంది. దీంతో ఎర్రచందనం మొక్కల మధ్య జామ మొక్కలు నాటించాడు. ఈ మొక్కలు నాటడం 2021 అక్టోబర్లో పూర్తి చేశాడు. ప్రతి మొక్కకు నీరందేలా డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయించాడు. పొలం చుట్టూ సోలార్ కంచెతోపాటు షెడ్డు కూడా వేయించాడు. ఇందుకోసం రూ.20 లక్షలు వెచ్చించాడు. డ్రిప్ ఇరిగేషన్కు రూ.1.50 లక్షలు ఖర్చు చేయగా.. సర్కారు రూ.50వేల సబ్సిడీ అందించింది.
ఫలాలను అందిస్తున్న జామ
జామ మొక్కలు నాలుగైదు అడుగుల ఎత్తు పెరగగానే ఏడాది కాలంలో కోతకు వచ్చే రకం కావడంతో తెంపడం మొదలు పెట్టారు. ఇప్పటికే నాలుగు సార్లు తెంపాడు. మార్కెట్లో ఒక్కో ట్రే (20 కిలోలు)కు రూ.450-రూ. 500ల వరకు పలుకుతుండడంతో కాయలు తెంపి ఇచ్చోడ, నిర్మల్, ఆదిలాబాద్ మార్కెట్లకు తరలించి అమ్ముతున్నాడు. నెల రోజుల వ్యవధిలోనే జామ కాయల అమ్మకం ద్వారా రూ. లక్ష వరకు ఆదాయం సమ కూరినట్లు యువరైతు తెలిపాడు. వేసవి కాలంలో చెట్ల కొమ్మలు కత్తిరించడం, అవసరమైన సమయంలో సేంద్రియ ఎరువులు, యూరియా, డీఏపీ వేయడం, పండుకు ఈగ వ్యాపించకుండా మందును పిచికారీ చేస్తే సరిపోతుందని తెలిపాడు. ఏడాది పొడువునా జామకాయలు కాసే ఈ రకం పంట మూలంగా రెండేళ్లలోపే పెట్టుబడి పోనూ రెట్టింపు ఆదాయం వస్తుందంటున్నాడు. జామ కాయలు తెంపడం, సస్యరక్షణ పనులు, మార్కెట్కు తరలించడం వంటి వాటితో యువతకు ఉపాధి చూపే అవకాశం కలిగిందంటున్నాడు. అంతర పంటగా వేసిన ఎర్రచందనం చేతికి వస్తే భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నాడు.
తపన ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది…
చేయాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. నేను ఎంబీఏ చదివా. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నా. కరోనాతో ఇంటికి వచ్చా. కొన్ని రోజులు ఇంటి నుండే పని చేశా. జీతాలు సరిగా చెల్లించకపోవడంతో జాబ్ మానేశా. మాకున్న పొలంలో భిన్నంగా సాగు చేయాలనుకున్నా. పండ్లు, దీర్ఘకాలికంగా ఆదాయానిచ్చే ఎర్రచందనం సాగు చేయాలనుకున్నాను. రెండు రకాల మొక్కలు తెప్పించి నాటించా. ఇప్పుడు జామ పంట చేతికి వచ్చింది. నిత్యం పొలాన్ని పర్యవేక్షిస్తున్నారు. మా పల్లెలోని కొంత మంది యువకులకు ఉపాధి చూపుతున్నాను.
– జాదవ్ శ్రీనివాస్, యువరైతు, నారాయణ్పూర్.