నిర్మల్ అర్బన్, జూలై 21 : ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నది. ఇప్పటికే హరితహారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటి ప్రజలందరికీ స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే దిశగా అడుగులు వేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయగా.. వాటిని పట్టణాల మాదిరిగా తీర్చిదిద్దారు. దీంతో పల్లె ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో పార్కులు లేని లోటును ప్రభుత్వం తీర్చింది. అదే తరహాలో మున్సిపాల్టీల్లోనూ పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణ ప్రకృతి వనాలను నిర్మిస్తున్నది. పట్టణ ప్రగతి నిధుల ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం రూ.2 నుంచి 5లక్షల వరకు నిధులను ఖర్చుచేస్తున్నది. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లోని ఆయా వార్డుల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది.
వార్డుకో వనం..
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రజలకు సైతం ఆహ్లాదకర వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాల తరహాలో పట్టణ ప్రకృతి వనాలను తీర్చిదిద్దనున్నారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాల్టీల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. నిర్మల్ మున్సిపాల్టీలో 42 వార్డులు, ఖానాపూర్ మున్సిపాల్టీలో 12 వార్డులు, భైంసా మున్సిపాల్టీలో 26 వార్డులు ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలో స్థలాల కొరత దృష్ట్యా రెండు మూడు వార్డులకు ఒకటి చొప్పున ప్రకృతి వనాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ప్రకృతి వనానికి రూ.2లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.
రూపుదిద్దుకుంటున్న ప్రకృతి వనాలు..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేస్తున్న ప్రకృతి వనాలు పూర్తి దశలో ఉన్నాయి.నిర్మల్ మున్సిపాల్టీలో 42 వార్డులకు గాను 26 వార్డుల్లో ప్రకృతి వనాలు పూర్తి కాగా..మరో 18 చివరి దశలో ఉన్నాయి. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 10 ప్రకృతి వనాలను ప్రారంభించగా, 9 పూర్తయ్యాయి. ఒకటి పూర్తి కావాల్సి ఉంది. భైంసా మున్సిపాలిటీలోని 26 వార్డుల్లో నాలుగు మాత్రమే పూర్తయ్యాయి. మరో 22 చివరి దశలో ఉన్నాయి. వారం రోజుల్లో వీటి పనులు పూర్తి కానున్నాయి. జిల్లా కేంద్రంలో పట్టణ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం అందించాలన్న ఉద్దేశంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రకృతి వనాలను వేగంగా పూర్తి చేయిస్తున్నారు. ఈ ప్రకృతి వనాల్లో ప్రజలు వాకింగ్ చేసేందుకు ట్రాక్, కూర్చునేందుకు బల్లాలు, చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, యువతీయువకులు వ్యాయామం చేసుకునేందుకు జిమ్ పరికరాలను అందుబాటులో ఉంచారు. పార్కుకు వచ్చే వారికి ఆరోగ్యం, ఆటలతో పాటు ప్రశాంతత లభిస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు..
పట్టణ ప్రజలందరికీ మంచి వాతావరణం, స్వచ్ఛమైన గాలిని అందించాలన్న ఉద్దేశంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచనల మేరకు నిర్మల్ పట్టణంలో వార్డుకో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే 26 ప్రకృతి వనాలను పూర్తి చేయడంతో ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. మిగతా వాటిని త్వరలోనే పూర్తి చేస్తాం. పట్టణ అభివృద్ధికి మంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారు. మంత్రి సహకారంతో నిర్మల్ పట్టణాన్ని మహా నగరంగా తీర్చిదిద్దుతాం. – గండ్రత్ ఈశ్వర్, మున్సిపల్ చైర్మన్, నిర్మల్