మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ బృందం సందర్శించనున్నది. నేడు, రేపు కాలేజీలో నాణ్యతాప్రమాణాలను పరిశీలించనున్నది. అభివృద్ధి, తరగతుల నిర్వహణ, సాధించిన ఫలితాలు తదితర అంశాలపై వివరాలు సేకరించనున్నది. గ్రేడింగ్ ఆధారంగా మరిన్ని నిధులు రానుండగా, ఈ కాలేజీ ప్రగతి సాధించే అవకాశమున్నది. కాగా, బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి పూర్వ విద్యార్థులంతా హాజరుకావాలని సంఘం అధ్యక్షుడు కేవీ ప్రతాప్, ఎమ్మెల్యే దివాకర్రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ వీ చక్రపాణి కోరారు.
కళాశాలలోని ల్యాబ్
మంచిర్యాల, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యతను పరిశీలించేందుకు 21, 22 తేదీల్లో న్యాక్(NAAC) బృందం సందర్శించనున్నది. ఈ బృందంలో డాక్టర్ అశోక్ బోయిటే, కొల్హాపూర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ శివాజీ, డాక్టర్ రిచా చోప్రా, ఐఐటీ కోరఖ్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ మీనాక్షి సుందర్ రాజన్ అవుదాయి, ప్రిన్సిపాల్ నాజిల్, క్యాథలిక్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నాగర్ కోయిల్ తమిళనాడు తదితరులు రానున్నారు.
ఇప్పటికే రూసా నుంచి రూ. 2 కోట్లు..
మంచిర్యాల డిగ్రీ కళాశాల 1966-77లో ఏసీసీలో స్థాపించబడింది. 1976-77లో నూతన భవనంలోకి మార్చారు. నాటి నుంచి రెండు పర్యాయాలు న్యాక్ బృందం కళాశాలను సందర్శించింది. ఈ రెండుసార్లు కూడా కాలేజ్కు మంచి గ్రేడ్ వచ్చింది. దీంతో 2 కోట్ల రూసా(RUSA) నిధులు రావడంతో కళాశాలలో అదనపు తరగతుగదుల సమాదాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం న్యాక్ బృందం సందర్శనలో కళాశాలకు ఉత్తమైన గ్రేడ్ వస్తే కాలేజీకి మరిన్ని నిధులు సమకూరనున్నాయి. దీంతో కళాశాలను మరింత అభివృద్ధి చేయవచ్చునని ప్రిన్సిపాల్ చక్రపాణి తెలిపారు.
పూర్వ విద్యార్థుల సేవలు
పూర్వ విద్యార్థులు మంచిర్యాల డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. గోడలకు ఆకర్షణీయమైన బొమ్మలు వేయించారు. సోలార్ ల్యాంప్స్ బహూకరించారు. మోషన్ సెన్సార్ ల్యాంప్స్ అందించారు. నీటి సంరక్షణ కిట్, వ్యర్థాలతో ఎరువుల తయారీ, స్టడీ సెంటర్, కళాశాల ఆవరణలో గార్డెనింగ్, వీల్ చైర్స్, దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు.
అభివృద్ధికి సహకరించండి
మంచిర్యాల డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు న్యాక్ బృందం పర్యటించ నుంది. కాలేజీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించాలి. నేను పూర్వ విద్యార్థిగా గర్వ పడుతున్నాను. కాలేజీ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరుతున్నాను.
– నడిపెల్లి దివాకర్రావు, ఎమ్మెల్యే, మంచిర్యాల
అందరి భాగస్వామ్యంతోనే..
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల దినదినా భివృద్ధి చెందుతు న్నది. పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, శ్రేయోభిలాషులు, దాతలు సేవలు అందిస్తున్నారు. మూడోసారి పర్యటిస్తున్న న్యాక్ బృందానికి కాలేజీ ప్రగతిని వివరించాలి.
– డాక్టర్ వీ చక్రపాణి, ప్రిన్సిపాల్, జీడీసీ, మంచిర్యాల
విజయవంతం చేయాలి
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 21, 22 తేదీల్లో న్యాక్(NAAC) బృందం సందర్శించి గ్రేడింగ్ ఇవ్వనున్నది. కళాశాల పూర్త విద్యార్థుల ద్వారా వివరాలు సేకరిస్తుంది. బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం చేస్తున్న, చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఈ బృందానికి వివరించాల్సి ఉంటుంది. పూర్వ విద్యార్థులంతా ఈ కార్యక్రమానికి సకాలంలో హాజరై విజయవంతం చేయాలి.
– కేవీ ప్రతాప్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు, జీడీసీ, మంచిర్యాల.