ఆదిలాబాద్ టౌన్, మార్చి 1 : అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. పట్టణలోని గాంధీనగర్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. కంటి పరీక్షల నిర్వహణ, మందులు, కండ్ల అద్దాల పంపిణీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. శిబిరానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్, కౌన్సిలర్ ఆవుల వెంకన్న, రామేశ్వర్, కొండ గణేశ్ ఉన్నారు.
అంగన్వాడీ కేంద్రం ప్రారంభం
ఆదిలాబాద్ టౌన్, మార్చి 1 : గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రతినిత్యం పౌష్టికాహారం అందిస్తూ వారి సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పాటు పడుతున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న చొరవతో పట్టణంలోని ఆరో వార్డు ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రం భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో తల్లులు, బిడ్డలకు అందించే పౌష్టికాహార పదార్థాలను పరిశీలించారు. పలువురికి గుడ్లు, బాలామృతం పంపిణీ చేశారు. అంతకుముందు కార్యక్రమానికి వచ్చిన చైర్మన్ను బీఆర్ఎస్ నాయకులు, అంగన్వాడీ సిబ్బంది శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సీడీపీవో వనజ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్, కౌన్సిలర్లు దయాకర్, వెంకన్న, నాయకులు త్రియంబక్, రూపేశ్, ప్రణయ్చారి పాల్గొన్నారు.
పరామర్శ
పట్టణంలోని భాగ్యనగర్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త తాటి లక్ష్మణ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం అతని ఇంటికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట గణేశ్, నల్ల మహేందర్, రంగినేని శ్రీనివాస్ ఉన్నారు.