ఎదులాపురం, డిసెంబర్ 2 : పట్టణంలోని అన్ని చౌక్లు సుందర ప్రదేశాలుగా తీర్చిదిద్దనున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్ వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. మున్సిపల్ సిబ్బంది, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. పూర్తిస్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలకు కనీస వసతులు కల్పించడంతో పాటు పట్టణ సుందరీకరణే లక్ష్యంగా అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే జోగు రామన్న సూచన మేరకు మరోనెల రోజుల్లోగా ప్రధాన కూడళ్ల అభివృద్ధి పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని వివరించారు.
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్పేర్ సొసైటీ హెచ్హెచ్డబ్ల్యూఎస్ఏ లోగోను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సంఘం నాయకులుతో కలిసి ఆవిష్కరించారు. అలాగే సొసైటీకి రూ.2వేలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సామాజిక కార్యక్రమాల్లో ముందు ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఎండీ ఇమ్రాన్, సొసైటీ సభ్యులు సయ్యద్ సాజీద్, హర్షద్, ఎస్కే ఖలీల్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.