పెద్దఅడిశర్లపల్లి, అక్టోబర్ 25 : కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రాజకీయ సంక్షోభంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ఘాట్నెమలిపురం, మాదాపురం, భీమనపల్లి, ఘనిపల్లి, పోల్కంపల్లి, ఘనపురం, అక్కంపల్లి, గుడిపల్లి, రోళ్లకల్, చిల్కమర్రి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ప్రజలు అష్టకష్టాలు పడుతున్న విషయం అందరికీ తెలుసని, ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కూడా మోసం చేయాలని ఆ పార్టీ చూస్తున్నదన్నారు. గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు వాటిని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో దేవరకొండ నియోజకవర్గం సంపూర్ణంగా అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
ప్రతి ఇంటికీ బీమా అందించడం ద్వారా ఆయా కుటుంబాలకు దీమా కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్ల పాలనలోనే రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ అభివృద్ధిని కొనసాగించాలంటే ప్రజలందరూ కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కేతావత్ బిల్యానాయక్, ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి, నాయకులు ముచ్చర్ల ఏడుకొండల్, ముత్యంరావు, తెరా భాస్కర్రెడ్డి, కటికనేని మాధవరావు, మునగాల అంజిరెడ్డి, తోటకూరి పరమేశ్, శీలం శేఖర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు గుత్తా అమిత్రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా అమిత్రెడ్డి ప్రజలను ఆప్యాయతంగా పలుకరిస్తూ, పథకాలను వివరిస్తూ జనంలో కలిసిపోయారు. గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అని చెప్పగానే గిరిజనులు దగ్గరకు వెళ్లి పలుకరిస్తూ అభిమానం చాటారు. ప్రతి తండాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ఈప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చేసిన సేవలను అమిత్ వివరించారు.