ఎదులాపురం, సెప్టెంబర్ 10 : తెలంగాణ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలి మహిళ చాకలి ఐలమ్మ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. స్థానిక రిమ్స్ ప్రాంగణంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, ఎమ్మెల్యే, అదనపుకలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వాతం త్య్ర సమరయోధుల జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరురాలు ఐలమ్మ అని, ప్రతి ఒక్కరూ అమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదని వివరించారు. అర్హులైన బీసీ లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రిమ్స్ ఆవరణలో నూతన విగ్రహ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఐలమ్మను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తా, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగం, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, వార్డెన్లు, ప్రజలు పాల్గొన్నారు.
కుల రాజకీయాలకు తావివ్వకుండా అన్నింటినీ మమేకం చేస్తూ అభివృద్ధిలో ముందుకు పోతున్న ప్రభుత్వం బీఆర్ఎస్ అని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్ల రవీందర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఐక్యతాభావాన్ని పెంపొందించేలా సంఘ నాయకులతో కలిసి చేయీచేయీ కలిపి అభివాదం తెలిపారు నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ముదిరాజ్ సమాజాభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేగా తనవంతు పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మహిళలకు సైతం జోగు ఫౌండేషన్ తరఫున ఉచిత కుట్టుమిషన్ క్యాంపులు ఏర్పాటు చేసి మిషన్లను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో పిట్టల రవీందర్, బొజ్జ నారాయణ , శివయ్య, సత్యనారాయణ, దారవేణి రాము, దార్ష రవి, బొజ్జ సంతోష్, బుట్టి శివకుమార్, సలంద్ర, రాజు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 10 : మున్సిపల్ నూతన భవనంలో సర్వమత గురువుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న చేతుల మీదుగా శాలువాతో సన్మానించి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, మున్సిపల్ కమిషనర్ శైలజ పాల్గొన్నారు.