రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్మల్ జిల్లాలో పండుగలా నిర్వహించుకుందామని రాష్ట్ర అటవీ, పర్యావరణ. న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్లో మంగళవారం జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించగా, ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖానాయక్, కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని చాటేలా వేడుకలు నిర్వహిద్దామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఓర్వలేకే విపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా, 42 ఎజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు.
నిర్మల్ టౌన్, మే 30: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ప్రతి పల్లె, పట్టణాల్లో పండుగ వాతావరణంలో నిర్వహించుకుందామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పట్టణంలోని దివ్యగార్డెన్లోని జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు కలెక్టర్ వరుణ్రెడ్డి, ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశంలో ఎజెండాలోని 42 అంశాలపై చర్చించగా, ముందుగా జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చర్చ జరిగింది. జిల్లాలో పదేళ్లలో వ్యవసాయం పండుగలా మారిందని, అందుకే దశాబ్ది ఉత్సవాల్లో 3న రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 79 వ్యవసాయ క్లస్టర్లలో నిర్వహించే రైతు దినోత్సవ వేడుకల్లో రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని మంత్రి కోరారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే కొత్త జిల్లాను ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, పెద్ద ఎత్తున గురుకుల కళాశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చేనెల 4న కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులను విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖపై చర్చ జరగగా, ఈసారి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేస్త్తుందని తెలిపారు. జిల్లాలో మక్క రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. మరో ఆరు సబ్స్టేషన్లు కొత్తగా మంజూరయ్యాయని తెలిపారు. పదేళ్ల క్రితం నిర్మల్ అభివృద్ధి ఎలా ఉండేదో, ప్రస్తుతం ఎలా మారిపోయిందో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా అర్హులైన వారికి కంటి అద్దాలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు అందించడం జరుగుతుందన్నారు. ఆయా శాఖల ద్వారా చేపట్టిన ప్రగతి నివేదికలను సంబంధిత అధికారులు సమావేశంలో వివరించారు.
అభివృద్ధిని అడ్డుకుంటూ విమర్శలా..
దేశంలో, రాష్ట్రంలో గత 30, 40 ఏళ్లు మీరే పాలించారు కదా.. ఇటువంటి పథకాలు ఎప్పుడైనా చూశారా రైతుల కోసం వడ్లు, మక్కలు కొంటే అది జీర్ణించుకోలేక ప్రతిపక్ష సభ్యులు రైతులపై మొసలికన్నీరు కారుస్తూ రాస్తారోకోలు, ధర్నాలు చేస్తే ఎవరూ నమ్మరు. దమ్ము, ధైర్యం ఉంటే చేసిన అభివృద్ధిపై చర్చించుకుందాం. కేవలం ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు సమావేశంలో విమర్శించడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటున్నది అక్కడ ఏమి చేయలేని మీరు ఇక్కడ మా అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ బీజేపీ సభ్యులైన జానాబాయి, కాంగ్రెస్ సభ్యులైన పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖపై చర్చ జరుగుతుండగా పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి జోక్యం చేసుకొని ఎక్కడ మోసం చేస్తున్నారని నిలదీశారు.
పెంబి జడ్పీటీసీ సభ్యురాలు జానాబాయి పస్పుల వంతెనపై రాజకీయం చేయడం తగదని సమావేశంలోనే మాట్లాడితే సమస్య పరిష్కారమవుతుందా అంటూ మంత్రి చురకలు అంటించారు. అభివృద్ధికి సూచనలు, సలహాలు అందిస్తే తప్పకుండా తీసుకుంటాం అంతేకాని ప్రభుత్వంపై బురద జల్లితే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. దీనిపై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ జోక్యం చేసుకొని ఖానాపూర్ నియోజకవర్గంలో తాము చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే అక్కడి జడ్పీటీసీ సభ్యురాలు దుష్ప్రచారం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓట్లతోనే బుద్ది చెబుతామని తెలిపారు.
దీంతో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని పేర్కొంటూ ఇద్దరు సభ్యులు మంత్రితో వాగ్వాదానికి దిగారు. సభ్యులంటే తమకు గౌరవమని, సమావేశంలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. దీంతో సభ్యుల తీరుపై బీఆర్ఎస్ సభ్యులు జీవన్రెడ్డి, రామేశ్వర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షురాలు సాగరబాయి రాజన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, జిల్లా అధికారులు రవీందర్రెడ్డి, శంకరయ్య, ధన్రాజ్, తనూజ, సుశీల్, శ్రీనివాస్రెడ్డి, నర్సింహారెడ్డి, దేవేందర్రెడ్డి, రామారావు, శ్రీలత, శ్రీకళ, శంకర్, అంజిప్రసాద్, మల్లికార్జున్, అశ్వక్, సందీప్, శ్యాంరావురాథోడ్, క్రాంతికుమార్, నర్సింహారావు, శ్రీనివాస్బాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి..
సమావేశంలో లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వపరంగా పరిష్కరించే వాటికి వారం రోజుల్లో పరిష్కార మార్గం చూపుతాం. జడ్పీ సమావేశంలో సభ్యులు పలు అంశాలను సభ దృష్టికి తెచ్చారు. వాటిని నోట్ చేసుకున్నాం. జూన్ మొదటి వారంలోపే మక్క, వరి ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేస్తాం. లారీల కొరత తీరుస్తాం. జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాలకు రూ. 75 కోట్లు మంజూరయ్యాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తాం. -వరుణ్రెడ్డి, నిర్మల్ కలెక్టర్
గిరి వికాసం మేలు కలిగించేలా చూడాలి..
నిర్మల్ జిల్లాలో గిరి వికాసం పథకంలో అర్హులైన గిరిజన రైతులందరికీ బోర్లు, విద్యుత్ కనెక్షన్లు అందించి సాగు ప్రయోజనం చేకూర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. గిరిజన రైతులు బోర్లు వేసుకొని విద్యుత్శాఖ అధికారులకు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా, పట్టించుకోవడం లేదు. ఈనెలాఖరు వరకు కనెక్షన్లు ఇచ్చి రైతులకు మేలు చేయాలి.
-విఠల్రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి..
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఖానాపూర్ నియోజకవర్గంలోని సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎప్పటికప్పుడు సహకరిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. సౌకర్యాలను మరింత మెరుగుపరిచేలా అధికారులు చొరవ చూపాలి. కొట్టుకపోయిన పస్పుల బ్రిడ్జి పనులను పూర్తి చేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఆ ప్రాంతంలో ఓట్లు అడుగుతాం.
-రేఖానాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే
జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలి.
జిల్లా అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్ర తినిధులు భాగస్వాములైనప్పుడే జిల్లా మరింత అభివృద్ధి చెందు తుంది. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో దశాబ్ద కాలంలో నిర్మల్ జిల్లాలోని అన్ని పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తు న్నాయి. అందుకే దశాబ్ది ఉత్సవాలను పల్లెల్లో ఘనంగా నిర్వహించుకుందాం. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలి.
-విజయలక్ష్మి, నిర్మల్ జడ్పీ చైర్పర్సన్