ఎదులాపురం, జూన్ 27: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా సరి చూసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాపై వారికి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పేర్లు లేని వారు ఫాం నంబర్-6 ద్వారా మళ్లీ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల సంవత్సరం నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఓటరు నమోదు, సమగ్ర ఓటరు జాబితా తయారు చేశామని తెలిపారు. ఆగస్టు 31వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని, సెప్టెంబర్ 21 నాటికి డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తామని చెప్పారు. తుది జాబితాను అక్టోబర్ 4న ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో కూడా తెలుసుకోవాలని సూచించారు. నామినేషన్ చివరి తేదీ నుంచి పది రోజుల ముందు వర కు తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నటరాజ్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఆయా పార్టీల అధ్యక్షులు, నాయకులు తదితరలు పాల్గొన్నారు.