ఆదిలాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ) : ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నదని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేసి రాష్ట్రంలో ఆదర్శవంతమైన మార్పును తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సూచించారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో ప్రజాపాలన, ఆరు గ్యారెంటీల అమలుపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఆరు గ్యారెంటీలను అర్హులందరికీ అందేలా చూడాలని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా పనిచేసి.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పథకాలను అర్హులకు వర్తింప చేయాలని సూచించారు. నేటి(గురువారం) నుంచి జనవరి 6వ తేదీ వరకు మహలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేయాలని, దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని మంత్రి సూచించారు.
గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన హైమన్డార్ఫ్ వర్ధంతిని జనవరి 11వ తేదీన అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. విద్య, వైద్యం, సంక్షేమం, రవాణా రంగాలు మెరుగుపర్చడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. గిరిజనులకు పోష్టికాహారం పంపిణీ చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి ప్రజాపాలన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్, ఖానాపూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు పటేల్, గడ్డం వినోద్.. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్లు రాథోడ్ జనార్దన్, విజయలక్ష్మీ, కృష్ణారావు.. మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఎస్పీలు ఉదయ్కుమార్ రెడ్డి, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.