ఆదిలాబాద్ జిల్లాలో 22 పీహెచ్సీల ద్వారా గ్రామీణులకు, ఐదు యూహెచ్సీల ద్వారా పట్టణవాసులకు వైద్యసేవలు అందుతున్నాయి. వీటితోపాటు జిల్లా కేంద్రంలోని రిమ్స్, ఉట్నూర్, బోథ్ కమ్యూనిటీ దవాఖానల్లో కూడా సర్కారు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తోంది. కాగా.. సిరికొండ, మావల మండలాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. సిరికొండ మండలానికి చెందిన వారు ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగురం, ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ పీహెచ్సీలకు.. మావలలో పల్లె దవాఖాన ఉండగా పరిసర గ్రామాలు, కాలనీల ప్రజలు ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి పీహెచ్సీకి వెళ్తున్నారు.
రెండు మండలాల ప్రజలకు స్థానికంగా వైద్యం అందేలా ప్రభుత్వం సిరికొండ, మావల మండలాలకు కొత్తగా పీహెచ్సీలను ఏర్పాటు చేసింది. ఒక్కో దవాఖాన భవనాన్ని రూ.1.43 కోట్లతో నిర్మించనున్నది. ఇందులో ప్రజలకు అన్ని రకాల వైద్యం అందేలా గదులను నిర్మిస్తారు. కొత్త పీహెచ్సీల ఏర్పాటుపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – ఆదిలాబాద్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ)