Marriage Certificate | భైంసాటౌన్, ఫిబ్రవరి 22 : ఇకపై గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనే వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలోనే వివాహ నమోదు ప్రక్రియకు చర్యలు చేపట్టింది. సరికొత్త ఆలోచనతో గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు వివాహాన్ని నమో దు చేసే అవకాశం కల్పించింది. దీంతో ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకునే పేదింటి ఆడబిడ్డలున్న కుటుంబాలకు కొంత వెసులుబాటు కలుగనున్నది. ప్రతి జీపీ లో పెండ్లి నమోదును చేపడుతుండడంతో ఇక బాల్య వివాహాలకు పెద్దఎత్తున చెక్ పడనున్నది.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 396 జీపీలు ఉన్నా యి. చట్టం నిబంధనల మేరకు అమ్మాయికి 18 ఏండ్లు, అబ్బాయికి 21 ఏండ్లు నిండిన తర్వాతే పెండ్లి చేయాలి. ఈ మేరకు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు ఈ చట్టంపై అవగాహన క ల్పించాలి. వివాహానికంటే ముందుగానే ఆయా గ్రామపంచాయతీల్లో వివాహ రిజిస్ట్రేషన్ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వివా హం చేయాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యదర్శులు గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి సభ నిర్వహించి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. కాగా, కొన్నిచోట్ల బాల్యవివాహాలు జరుగుతున్న సమాచారం అందడంతో ఐసీడీఎస్, స్వచ్ఛంద సంస్థలు అడ్డుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయాన్ని ఆడబిడ్డల పెండ్లి కానుకగా అందజేస్తున్నది. దీంతో సాయం పొందేందుకు వివాహ నమోదు తప్పనిసరి కావడంతో లబ్ధిదారులు కార్యదర్శులను సంప్రదిస్తున్నారు. అన్ని పత్రాలు సమర్పించి వివాహ ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు.
ప్రభుత్వం బాల్య వివాహాలకు అడ్డుకట్టవేసేందుకు చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీ పరిధిలో వివాహ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు వివాహ నమోదు కొనసాగించేలా చర్యలు చేపట్టాం. ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. దీంతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడడమే కాకుండా.. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో మేలు చేకూరనున్నది.
– గోపాలకృష్ణారెడ్డి, ఎంపీడీవో, భైంసా