మందమర్రి: పౌరుల రక్షణ, భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నామని మందమర్రి (Mandamarri) సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో ఆదివారం తెల్లవారుజామున మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వీ టెంపుల్ ఏరియాలో సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ నిర్వహించారు. ఇందులో భాగంగా కాలనీలోని అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏరియాకు కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు, సరైన ధ్రువపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, 4 త్రిచక్ర వాహనాలను (ఆటోలు) సీజ్ చేశారు.
ఈ సందర్భంగా సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ నేర నిర్మూలన సాధ్యమన్నారు. కాలనీలో అపరిచితులు, నేర చరిత్ర కలిగిన వారు ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు రహస్యంగా సమాచారం అందించాలని కోరారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా మత్తుపదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఒక మహిళ ఇంటిపై దాడి చేసి, అమ్మకానికి సిద్ధంగా ఉన్న 8 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నామని, ఆమెపై కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు. కాలనీల స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, దీనికి పోలీసుల పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్సై రాజశేఖర్, అదనపు ఎస్సై శ్రీనివాస్, రామకృష్ణాపూర్ అదనపు ఎస్సై లలిత,సిబ్బంది,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.