శాతవాహన యూనివర్సిటీకి మంచిర్యాల, ఆసిఫాబాద్..
తెలంగాణ యూనివర్సిటీకి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు..
మార్పునకు కసరత్తు.. ప్రతిపాదనలు సిద్ధం..
తగ్గనున్న దూరభారం, వ్యయం..
మంచిర్యాల, ఆగస్టు 23, నమస్తే తెలంగాణ : పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కారు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం వర్సిటీల పరిధి మార్పునకూ కసరత్తు మొదలు పెట్టింది. ఈ విషయమై లోతుగా చర్చించిన ప్రత్యేక కమిటీ తాజాగా ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలు పంపించింది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ(కేయూ) పరిధిలో కొనసాగుతుండగా.. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీ (ఎస్యూ).. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు తెలంగాణ యూనివర్సిటీ (టీయూ)లోకి చేర్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం ఆమోదం తెలిపితే అమల్లోకి రానుండగా, ఆయా జిల్లాలవాసులకు ప్రయోజనం చేకూరనున్నది.
పరిపాలనా సౌలభ్యం, రాష్ట్ర సుపరిపాలన కోసం తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ సర్కారు జిల్లాలను విభజించింది. 10 జిల్లాల నుంచి 33 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. దూరభారం తగ్గడంతో ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. అధికారుల పర్యవేక్షణతో పాటు బాధ్యత కూడా మరింత పెరిగింది. విశ్వవిద్యాలయాల పరిధి మార్పులను కూడా ప్రత్యేక కమిటీ పూర్తి చేసింది. పలు మార్లు సమావేశమై, లోతుగా చర్చించి ప్రతిపాదనలను ఉన్నత విద్యామండలికి సమర్పించింది. ప్రస్తుతం ఉన్న మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి తొలగించింది. కరీంనగర్ పరిధిలోని శాతవాహన యూనివర్సిటీలోకి చేర్చింది. దీంతో ఆయా జిల్లాల వాసులకు దూరభారం తగ్గింది.
జిల్లాల పెంపుతో పలు జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలు మరో జిల్లాలో విలీనం కావడంతో యూనివర్సిటీల పరిధి మార్పుపై ఉన్నత విద్యామండలి అధికారులు తీవ్ర కసరత్తు చేశారు. ఇందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సభ్యులు జిల్లాల మధ్య దూరం, కాలేజీల సంఖ్యను బట్టి వర్సిటీల పరిధి మార్పుపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటి ఆధారంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఆయా ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే, వర్సిటీల పరిధి మార్పు అమల్లోకి రానున్నది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే ముఖ్యంగా మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు వరంగల్ పరిధిలోని కాకతీయ యూనివర్సిటీ నుంచి కరీంనగర్ పరిధిలోని శాతవాహన యూనివర్సిటీలోకి రానున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్తో పాటు మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉంటాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను కాకతీయ పరిధి నుంచి తొలగించారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీపై ఒత్తిడిని తగ్గించేందుకు మెదక్, సిద్ధిపేట జిల్లాలను తొలగించి తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల కిందికి తీసుకొచ్చారు.
దూరభారం తగ్గించేందుకే..
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి వయా గోదావరిఖని, మంథని, జయశంకర్ భూపాలపల్లి, పరకాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దూర భారం అవుతుంది. మరో దారిలో గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మీదుగా కరీంనగర్.. అక్కడి నుంచి వరంగల్ వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలను కేయూ పరిధి నుంచి కరీంనగర్ పరిధిలోని శాతవాహన యూనివర్సిటీలోకి తీసుకొచ్చారు. మంచిర్యాల నుంచి కరీంనగర్కు దాదాపు మూడు గంటల ప్రయాణం కాగా, వరంగల్కు వెళ్లాలంటే మరో రెండు గంటల అదనపు భారం అవుతుంది. ప్రస్తుతం కరీంనగర్ పరిధిలోకి మార్చడంతో ఆయా జిల్లాల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.