మంచిర్యాల, జూన్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల ఆర్టీవో కార్యాలయం బార్ అండ్ రెస్టారెంట్గా మారింది. ఆదివారం సెలవు రోజు కావడంతో కార్యాలయ అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు మద్యం సేవిస్తూ, పేకాట ఆడారు. ఈ బాగోతం అంతా కార్యాలయ ఆవరణలో డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించే ప్రాంతం, షెడ్డులోనే జరిగింది. పక్కనున్న పొలాల్లో డబ్బులు బెట్టింగ్ పెట్టి పేకాట ఆడారు. సమాచారం తెలుసుకున్న విలేకరు లు వెళ్లగా ‘ఏం చేసుకుంటారో చేసుకోండి.. అధికారులు కూడా ఇప్పటివరకు మాతో కూర్చొని మద్యం తాగి పోయారు. ఏమైనా వాళ్లతోనే మొదలవుతుంది. మేము పదిహేనేళ్లుగా ఇలాంటి దావత్లు ఇక్కడ ఎన్నో చేసుకున్నాం. మీకు ఇష్టమున్నది చేసుకోండి’ అంటూ దురుసుగా ప్రవర్తించారు.
ఆ సమయంలో అక్కడ కూర్చున్న వారి చేతుల్లో పేక ముక్కలు, డబ్బులు కనిపిం చాయి. ఈ విషయంపై మంచిర్యాల ఆర్టీవో కిష్టయ్యను వివరణ కోరగా.. ‘జనరల్గా యేటా అక్కడ ఒక మేకను కోస్తారు. పోగులు వేసుకొని ఇంటికి తీసుకువెళ్తారు. కానీ.. ఈ రోజు అక్కడే వంట చేసుకొని, మందు కూడా తాగినట్లు ఇప్పుడే నాకూ తెలిసింది. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.