ఎదులాపురం, జూలై 25 ః బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారిని లక్ష్యంగా చేసుకొని సూటీలు, కార్ల డికీలు పగులగొట్టి నగదు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.80 లక్షల నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.
గత నెల ఆదిలాబాద్ పట్టణంలోని ఐడీబీఐ బ్యాంక్ నుంచి నగదు డ్రా చేసిన వ్యక్తిని వెంబడించి నేతాజీ చౌక్ సమీపంలో పార్ చేసిన ఆక్టివ సూటీ డికీ పగులగొట్టి రూ.3 లక్షల నగదు అపహరించిన కేసును పోలీసులు ఛేదించినట్లు తెలిపారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడు శంకర్ అలియాస్ శంకరప్ప తన సహచరులతో కలిసి అంతర్రాష్ట్ర స్థాయిలో ముఠాగా ఏర్పడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో ఇదే తరహా చోరీలకు పాల్పడినట్లు వెల్లడైందన్నారు.
విచారణలో నిందితుడు తన సహచరులు షేకర్, శ్రీనివాస్, సంజీవ్, సాయిలతో కలిసి కర్ణాటకలోని భద్రావతి నుంచి వివిధ రాష్ర్టాలకు వెళ్లి అనేక చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. గతంలో మహారాష్ట్రలోని చంద్రపూర్లో మోటార్ సైకిల్ దొంగిలించి, కార్ అద్దాలు పగులగొట్టి రూ.25 వేల నగదు అపహరించినట్లు, అనంతరం ఆదిలాబాద్కు వచ్చి ఐడీబీఐ బ్యాంక్ వద్ద నగదు డ్రా చేసిన వ్యక్తిని వెంబడించి రూ.3 లక్షలు చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
అపహరించిన నగదులో నిందితుడి వాటాగా వచ్చిన మొత్తంలో మిగిలిన రూ.1.80 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కలిపి మొత్తం 22 కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చంద్రపూర్, ఔరంగాబాద్, నాసిక్, బెంగళూరు, బళ్లారి, రాయచూర్ ప్రాంతాల్లో ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన శంకర్ అలియాస్ శంకరప్ప కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా భద్రావతి నివాసి అని తెలిపారు. పరారీలో ఉన్న షేకర్, శ్రీనివాస్, సంజీవ్, సాయి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని, ఇతర రాష్ర్టాల పోలీసులతో సమన్వయం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, వన్ టౌన్ సీఐ బి.సునీల్కుమార్, ఎస్సైలు నాగనాథ్, సంజయ్, సైబర్ క్రైమ్ ఎస్సై గోపీకృష్ణ పాల్గొన్నారు.