ఎదులాపురం : పెద్ద పులుల అవాసాలను అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీసీఎఫ్ రామలింగం అన్నారు. అజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అటవీ శాఖ ద్వారా నిర్వహిస్తున్న ఇండియా ఫర్ టైగర్స్ ఎ ర్యాలీ అన్ వీల్స్ యాత్ర మంగళవారం రాత్రి జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఇందులో భాగంగా జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం పునఃర్యాలీని సీసీఎఫ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం యాత్ర పట్టణంలోని పలు వీధుల గుండా కొనసాగుతూ మహరాష్ట్ర వైపు వెళ్లింది. ఈ సందర్భంగా సీసీఎఫ్ రామలింగం మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా శ్రీశైలంలో ర్యాలీ మొదలైందన్నారు.
ఆదిలాబాద్, మహరాష్ట్ర మీదుగా అక్టోబర్ 2న ఒరిస్సాలో టైగర్ రిజర్వాయర్లో ముగుస్తుందన్నారు. దేశంలో ఉన్న పెద్ద పులుల సంఖ్యను పెంచడానికి, పులుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేలా ర్యాలీ చేపడుతున్నట్లు వెల్లడించారు. అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్లో పులుల అవాసాల అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తే పూర్వ వైభవం సాధ్యమపుతుందన్నారు. డీఎఫ్వో రాజశేఖర్, ఆసిఫాబాద్ ఐఎఫ్ఎస్ దినేశ్, ఎఫ్ఆర్వోలు ఆదిత్య, గులాబ్సింగ్, ఎఫ్బీవోలు తదితరులు పాల్గొన్నారు.