బేల : జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన వీరుడు కుమరం భీం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. సోమవారం బేల మండలంలోని చంద్పెల్లి గ్రామంలో కుమరం భీం వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులతో కలిసి కుమరం భీం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
దీంట్లో భాగంగా ఆదివాసి హక్కుల కోసం పోరాటం చేసిన వీరుడు కుమరం భీం పేరు మీదుగా జిల్లాకు నామకరణం చేయడమే కాకుండా జోడే ఘాట్లో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేసి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఆదివాసులు ఎంతో ఆరాధ్యదైవంగా కొలిచే దీపావళి పండుగకు దండారీలకు రూ. 10 వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పవర్ అక్షిత , టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రె, మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు జక్కుల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.