చిన్నారి వైద్యానికి కేటీఆర్ భరోసా
సీసీసీ నస్పూర్, మే 20 : ఆపదలోనున్న వారికి ఆపన్నహస్తం అందించడంలో ముందుండే మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న చిన్నారికి వై ద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుంచి రూ. లక్ష మంజూరు చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు విద్యానగర్కు చెందిన గుమ్మడిపెల్లి సత్యనారాయణ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన కుమార్తె ఆద్య (4) మెదడులో బ్లడ్క్లాట్ అయింది. 6 నెలల క్రితం హైదరాబాద్లోని రేయిన్బో పిల్లల దవాఖానలో చేర్పించారు.
అప్పటి నుంచి చికిత్స పొందుతున్నది. గతేడాది అక్టోబర్ 21న సత్యనారాయణ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేసి పాప పరిస్థితిని వివరించాడు. ఆయన వెంటనే స్పందించి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మొదట రూ. లక్ష మంజూరు చేయించగా, శుక్రవారం చెక్కును స్థానిక కౌన్సిలర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ తిరుపతి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి ప్రాణాలను కాపాడడానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని రూ. లక్ష అందించినట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ మేడం తిరుపతి, మాజీ వార్డు సభ్యుడు పెద్దపల్లి వెంకటేశ్, టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు ఎంబడి సమ్మయ్య, నాయకులు బలరాం, చెరుకు అజయ్ పాల్గొన్నారు.