కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలలో ఖాళీగా ఉన్న సర్పంచ్, పంచాయతీ వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో వార్డుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పంచాయతీ వార్డులు, పంచాయతీలు, మున్సిపాలిటీలో వార్డులు, ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరిలో రూపొందించిన ఓటరు జాబితా నుంచి ఖాళీగా ఉన్న స్థానాలకు సంబంధించి ఓటర్ల జాబితా రూపొందించాలని అధికారులకు సూచించారు.
జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తుది ఓటర్ల జాబితా పై సమావేశం నిర్వహించాలని తెలిపారు. ఓటరు జాబితా, స్థానిక పంచాయతీలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని, ఓటరు జాబితా పై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, నూతన ఓటర్ల నమోదు దరఖాస్తులు పరిశీలించి వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 21 నాటికి తుది ఓటరు జాబితాను వార్డుల వారీగా తయారు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశించారు. ఏప్రిల్ 23 నాటికి ఎంపిటిసి స్థానాలకు, జడ్పిటిసి స్థానాలకు సంబంధించి తుది ఓటరు జాబితా విడుదల చేసి ఖాళీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాలు గుర్తించాలని, బ్యాలెట్ బాక్సులు, ఇంక్ బాటిళ్లు మొదలైన ఎన్నికల సామగ్రి సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఓటర్ల తుది జాబితాను ప్రభుత్వ కార్యాలయాల్లో, పంచాయతీ ఆఫీసులో, జిల్లా వెబ్సైట్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ సిబ్బందిని గుర్తించాలని , ఎన్నికల బుక్ లెట్ లను రిటర్నింగ్ అధికారులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలను ముందస్తుగానే ఎంపిక చేసుకోవాలని, ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు టి-పోల్ లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో రత్నమాల, తదితరులు పాల్గొన్నారు.