ఆసిఫాబాద్, నవంబర్ 9 : తెలంగాణ ప్రభుత్వం మద్యం పాల సీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. 2021-2023 సంవత్సరానికి గాను జిల్లాలో 32 మద్యం షాపుల కోసం నోటిఫికేషన్ వెలువడింది. దీంతో మంగళవారం నుంచి ఈనెల వ తేది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 20న జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం భవనంలో కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వా రా ఎంపిక చేయనున్నారు.
జిల్లాలో 32 మద్యం షాపులు
జనాభా ప్రాతిపదికన జిల్లాలో 32 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏజెన్సీ ప్రాంతంలో 4 షాపులు, రిజర్వేషన్ల ప్రకారం 7 షాపులు, జనరల్ కేటగిరికి 21 షాపులను కేటాయించారు.
దరఖాస్తు చేయండిలా..
దరఖాస్తు ఫారాలు జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. సరైన వివరాలతో నింపి, ఆధార్, పాన్ కార్డు జత చేసి రూ. 2 లక్షల డీడీ ( డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, కుమ్రంభీం ఆసిఫాబాద్ ) పేరున తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వాటిని సీల్డ్ కవర్లో పెట్టి జిల్లా ఎక్సైజ్ అధికారికి అందించాల్సి ఉంటుంది.
మద్యం దుకాణానికి 3 శ్లాబులు
జిల్లాలో 26 మద్యం దుకాణాలకు సంబంధించి చెల్లించాల్సిన ఎక్సైజ్ ట్యాక్స్ మూడు శ్లాబులలో చెల్లించాల్సి ఉంటుంది. 8 దుకాణాలు రూ. 50 లక్షలు, 12 దుకాణాలు రూ. 55 లక్షలు, 6 దుకాణాలకు రూ. 60 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని మూడు దఫాలుగా చెల్లించేందుకు ఆధికారులు నిర్ణయించారు.
నిబంధనల ప్రకారమే పాపుల ఏర్పాటు
నిబంధనల ప్రకారమే మద్యం షాపులను ఏర్పాటు జరుగుతుందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎైక్సైజ్ అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 20న కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తామన్నారు. డ్రాలో వచ్చిన టెండరుదారు డిసెంబర్ 1 నుంచి షాపుల నిర్వహణ చేయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో సీఐ మోసిన్ అలీ ఉన్నారు.
మంచిర్యాలలో..
మద్యం షాపుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ భారతీ హోళికేరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021, డిసెంబర్ 1 నుంచి 2023, నవంబర్ 30 వరకు కాలపరిమితి ఉంటుందని, జిల్లాలో స్లాట్ 50 కింద 17, 55 కింద 17, 60 కింద 38, 65 కింద ఒక మద్యం షాపులున్నాయని పేర్కొన్నారు. వీరిలో షెడ్యూల్డ్ కులాల వారికి 10, షెడ్యూల్డ్ తెగల వారికి ఆరు, గౌడ కులస్తులకు ఆరు షాపులు రిజర్వు చేశామని తెలిపారు. ఈ నెల 18 ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదివారం మినహా జిల్లా కేంద్రంలోని ఆబ్కారీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 20న గోదావరి రోడ్లోని పద్మనాయక కల్యాణ మండపంలో లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తామని తెలిపారు.