ఆసిఫాబాద్ టౌన్, జూలై 16 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై సమగ్ర నివేదికలు తయారు చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనప్ప, కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి సమీక్షించారు. పంట, ఆస్తి నష్టం, బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. వ్యవసాయాధికారులు పంట నష్టంపై సర్వే చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు కొనసాగించాలని సూచించారు.
గుండివాగు బ్రిడ్జిని సందర్శించిన మంత్రి
ఆసిఫాబాద్ మండలంలోని గుండివాగు వంతెనను మంత్రి సందర్శించారు. వరదల వల్ల జరిగిన పంట నష్టంపై అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. పదేండ్ల నుంచి బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి బ్రిడ్జి త్వరలోనే పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట గుండి ఎంపీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్ గాదివేణి మల్లేశ్ ఉన్నారు.
క్రీడాకారిణికి రూ.2 లక్షల సాయం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ప్రపంచ హ్యాండ్బాల్ క్రీడాకారిణి మడావి కరీనాకు రూ.2 లక్షల చెక్కును మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అందజేశారు. జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న కరీనా అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచింది. ఆమెను అభినందిస్తూ ఆర్థిక సహాయం కింద ఉట్నూర్ ఐటీడీఏ నుంచి రూ.2 లక్షల చెక్కును పీవో వరుణ్రెడ్డి సమక్షంలో అందజేశారు. జూలై 30 నుంచి యూరప్లో జరగనున్న ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొంటున్న కరీనాను ఉమ్మడి ఆదిలాబాద్ ఆర్సీవో గంగాధర్, ప్రిన్సిపాల రమ్య లక్ష్మి, హ్యాండ్బాల్ సెక్రెటరీ రమేశ్, కోచ్ అరవింద్ అభినందించారు.