కుమ్రం భీం ఆసిఫాబాద్/మంచిర్యాల, జూలై 14 (నమస్తే తెలంగాణ) మంచిర్యాల అర్బన్, జూలై 14 : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు కాలనీలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం 61.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న గోదావరి, రాళ్లవాగుతో పాటు తోళ్లవాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసీ కాలనీ, రాంనగర్, పద్మశాలి కాలనీ, అండాలమ్మ కాలనీ, మేదరి వాడ, రెడ్డి కాలనీ, తిలక్నగర్, సాయికుంట, బృందావనం కాలనీలు, బైపాస్ రోడ్డు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే దివాకర్రావు, ఆయన తనయుడు, నడిపెల్లి దివాకర్రావు ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, ఎమ్మెల్సీ దండె విఠల్ లోతట్టు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మంచిర్యాలకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఆర్ఎఫ్) సహాయక బృందాలను మంత్రి కేటీఆర్ సహాయంతో ఎమ్మెల్యే దివాకర్రావు రప్పించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఇప్పటికి వరదలోనే ఉంది. దండేపల్లి మండలంలో గూడెం ఎత్తిపోతల పథకం పంపుహౌస్, సబ్ స్టేషన్ నీట మునిగింది.
లక్షెట్టిపేట మండలం పోతపల్లి గ్రామాన్ని రెడ్ అలర్ట్గా ప్రకటించి ప్రజలను సూరారం రైతు వేదికకు తరలించి భోజన వసతి ఏర్పాటు చేశారు. ముల్కల్ల పంపు హౌస్ నీట మునిగింది. నస్పూర్ మండల కేంద్రంలోని వినూత్న కాలనీలో వరదతో ఇండ్లలోకి రావడంతో పడవల సహాయంతో ఎమ్మెల్యే దివాకర్ రావు, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సురక్షిత ప్రాంతాలకు తరలింపజేశారు. జైపూర్ మండలం ఇందారం వద్ద గోదావరి ఉధృతంగా ఉండడంతో ఫారెస్ట్ చెక్పోస్ట్ మునిగిపోయింది. చెరువు నీరు రాజీవ్ రహదారిపై పొంగి పారడంతో మంచిర్యాల నుంచి గోదావరిఖని వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ముందు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏర్పాటుచేశారు.
ఇందారం సమీపంలో ఉన్న వరలక్ష్మీ బాయిల్డ్ రైస్ పూర్తి స్థాయిలో మునిగిపోయింది. రసూల్పల్లి వద్ద జాతీయ రహదారిపై వరద ఉధృతి తగ్గడంతో చెన్నూర్ – మంచిర్యాలకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రాణహిత, గోదావరి ఉప్పొంగడంతో ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏదుల్లబంధం గ్రామ సమీపంలోని తుంతుంగ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. వేమనపల్లి నుంచి చెన్నూర్కు రాకపోకలు నిలిచిపోగా, కల్మలపేటకు చెందిన గర్భిణిని నీల్వాయి ఎస్ఐ నరేశ్ బెల్లంపల్లి దవాఖానకు తరలించారు. కాసిపేట మండలంలోని దుబ్బగూడెంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తిరిగి పర్యటించారు. ఇండ్లు కూలిన బాధితులను పరామర్శించారు. సాలిగాంలో పీపీ రావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురైన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నెన్నెల మండలంలో లంబాడీతండా – ఎర్రవాగులో ప్రమాదవశాత్తు ఒకరు బ్రిడ్జిపై నుంచి పడ గా యువకులు కాపాడారు. ఓపెన్ కాస్టు గనులలో బొగ్గు ఉత్పత్తి కి ఆటంకం ఏర్పడింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 52 గేట్లు రెండు మీ టర్లు ఎత్తు ఎత్తి 10,30,926 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలా రు. జైపూర్ మండలంలోని సుందిల్ల బ్యారేజీ 64 గేట్లు ఎత్తి 11,05,546 క్యూసెక్కుల నీటిని, చెన్నూర్ మండలంలోని అన్నారం బ్యారేజీ 62 గేట్లు ఎత్తి 10,85,870 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు గురువారం కొంత తగ్గుముఖం పట్టాయి. వాగులు, ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. గురువారం జిల్లా వ్యాప్తంగా 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సుమారు లక్ష ఎకరాల్లో పంటలు నష్టపోయాయని అధికారులు అంచనా వేస్తుండగా, 50 రోడ్లు, 30 వంతెనలు దెబ్బతిన్నాయి. ముంపు ప్రభావిత ప్రాంతాలను జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు పరిశీలించారు. దహెగాం మండల కేంద్ర సమీపంలోని మల్లన్న ఒర్రెవద్ద బుధవారం గల్లంతైన సింగరేణి రెస్క్యూ టీమ్ మెంబర్లు చెలుక సతీశ్, అంబాల రాములు మృతదేహాలను గురువారం ఉదయం వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల దవాఖానకు తరలించారు. వట్టివాగు ప్రాజెక్టు సామర్థ్యం 2.890 టీఎంసీలు కాగా, 4,905 క్యూసెక్కుల వరద వస్తోంది. రెండు గేట్లు తెరిచి 4,720 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుమ్రం భీం ప్రాజెక్టు సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులోకి 87,653 క్యూసెక్యుల వరద నీరు వస్తోంది. అధికారులు మూడు గేట్లను తెరిచి 99,863 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.